గొట్టిపాటి వార్నింగ్.. క్రికెట్ టీం కాస్తావాలీబాల్ టీం అవుతుంది

స్పీకర్ కు రాసిన లేఖలోని అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

Update: 2024-06-26 04:13 GMT

జగన్ అండ్ కోకు ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బెదిరింపు రాజకీయాలకు ఇప్పటికైనా మార్చుకోవాలన్న మంత్రి.. ప్రజాస్వామ్య పద్దతిలో రాజకీయాలు చేయకుంటే జగన్ కు నష్టమన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖపై మండిపడ్డారు. స్పీకర్ కు రాసిన లేఖలోని అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

బెదిరింపు రాజకీయాలకు తెర దించకపోతే క్రికెట్ టీంగా ఉన్న ఆయన ఎమ్మెల్యేల సంఖ్య వాలీబాల్ టీంగా మారుతుందని హెచ్చరించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సింది పోయి.. తన తీరుతో ప్రజలు అసహ్యించుకునేలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష నేత హోదా లేని జగన్ ను పెద్ద మనసుతో చంద్రబాబు.. అసెంబ్లీలో ఆయన్ను గౌరవించారని.. కానీ దాన్ని నిలుపుకోవటం లేదన్నారు.

అర్హత లేకున్నా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జగన్ కు గుర్తింపు లభించిందన్న గొట్టిపాటి.. ‘‘వారు కోరినంతనే జగన్ వాహనాన్ని లోపలకు అనుమతించారు. వారు కోరినట్లే మంత్రుల తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయించారు.అయినా ఆయన బుద్ధి మారలేదు. సభాపతిని లక్ష్యంగా చేసుకుంటూ వక్రభాష్యంతో లేఖ రాశారు. ప్రజలు తమ తీర్పుతో పార్టీని పాతాళానికి తొక్కేసినా ఆయన బుద్ధి మారలేదని మరోసారి నిరూపించుకున్నారు’’ అంటూ మండిపడ్డారు.

Tags:    

Similar News