రేవంత్ ఢిల్లీ వెళ్లడం వెనుక కారణం అదా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తుండటంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-03-16 19:10 GMT

ఒకటి నిధులు రాష్ట్రానికి రావాలి.. రెండూ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలి. ఈ రెండు టార్గెట్లతోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్రమంత్రులను కలుస్తున్నాడా? అంటే ఔను అనే అసెంబ్లీలో నర్మగర్భంగా బయటపెట్టారు. బీఆర్ఎస్ పై ఒంటికాలిపై లేస్తున్న రేవంత్ రెడ్డి ఆ పార్టీని చావుదెబ్బ తీయడానికి కేంద్రంలోని పెద్దల సాయం కోరుతున్నట్టుగా ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. ఢిల్లీలో టాలీవుడ్ నిర్మాత కేదార్ మృతికి గల కారణాలు.. ఆయన పెట్టుబడులపై ఆరాతీసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించాడన్న వార్త ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డినే అసెంబ్లీ వేదికగా బయటపెట్టడంతో అంతకుమించిన స్కెచ్ ఏదో రేవంత్ రెడ్డి వేసినట్టుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తుండటంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, తాను ఢిల్లీకి వెళ్లిన మాట నిజమేనని, అంతేకాదు రానున్న రోజుల్లో వందలసార్లు కూడా వెళ్తానని రేవంత్ రెడ్డి శనివారం అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. తాను ఢిల్లీకి వెళ్లేది కేవలం సరదాగా కాదని, కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని కలవడానికేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను ఢిల్లీ వెళ్తున్నానని, అక్కడ కలవని కేంద్ర మంత్రి లేరని రేవంత్ చెప్పారు. అంటే, రాష్ట్రానికి నిధులతో సంబంధం లేని మంత్రులను కూడా ఆయన కలుస్తున్నట్లు తేలిపోయింది. ఈ పర్యటనల్లో నిధులతో పాటు, ఒక కీలకమైన రహస్యాన్ని కూడా రేవంత్ వెలికి తీసినట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇటీవల దుబాయ్‌లో టాలీవుడ్‌కు చెందిన నిర్మాత కేదార్ మరణించిన సంగతి విదితమే. ఒకటి రెండు సినిమాలు నిర్మించిన కేదార్, టాలీవుడ్ ప్రముఖులతో సన్నిహితంగా ఉండేవారని సమాచారం. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలతో ఆయనకు ఆర్థిక సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల నుంచి పెద్ద మొత్తంలో నిధులు సేకరించిన కేదార్, వాటిని వివిధ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తమ రహస్యం బయటపడుతుందనే భయంతోనే కేదార్ అంత్యక్రియలు దుబాయ్‌లోనే జరిగాయని స్వయంగా రేవంత్ ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేదార్ మృతి వెనుక దాగి ఉన్న రహస్యాన్ని రేవంత్ ఛేదించారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా రేవంత్ శనివారం అసెంబ్లీలో వెల్లడించారు. తన ఢిల్లీ పర్యటనల్లో ఇతర మంత్రులతో పాటు, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను కూడా ఆయన కలిశారు. ఈ సందర్భంగా, కేదార్ మృతికి దారితీసిన పరిస్థితులు, ఆ మరణం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు, కేదార్ అంత్యక్రియలు అక్కడే జరగడానికి గల కారణాలు వంటి పూర్తి వివరాలను జైశంకర్ సహాయంతో రేవంత్ దుబాయ్ నుంచి సేకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వివరాలను సరైన సమయంలో బయటపెడతానని రేవంత్ చెప్పారు, అయితే అందులో ఉన్న విషయం ఏమిటనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. దీంతో, ఢిల్లీలో రేవంత్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలతో పాటు, తెలంగాణలో జరుగుతున్న ముఖ్యమైన విషయాలను కూడా తెలుసుకునే దిశగా కీలకమైన చర్యలు తీసుకుంటున్నట్లుగా భావిస్తున్నారు.

Full View
Tags:    

Similar News