ఆంధ్రోళ్ల పెత్తనమేంది? ఈ మాటల్ని కేసీఆర్ ను అడగవేం ప్రవీణ్?

పెద్ద పదవుల్ని నిర్వహిస్తే సరిపోదు. విచక్షణ మరిచి.. లాజిక్కు మిస్ అయి నోటికి వచ్చినట్లుగా మాట్లాటంలో అర్థం లేదు

Update: 2024-05-29 05:20 GMT

పెద్ద పదవుల్ని నిర్వహిస్తే సరిపోదు. విచక్షణ మరిచి.. లాజిక్కు మిస్ అయి నోటికి వచ్చినట్లుగా మాట్లాటంలో అర్థం లేదు. మాజీ ఐపీఎస్ అన్న బ్యాక్ గ్రౌండ్ తో పాటు.. నిత్యం నీతులు వల్లించే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. తన నోటి నుంచి విద్వేషాన్ని కక్కటంలో అర్థం లేదు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆంద్రా సంగీత దర్శకుడు కీరవాణి పెత్తనం ఏంది? అదీ తెలంగాణ వచ్చిన పదేళ్ల తర్వాత అంటూ బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ప్రపంచంలో మరెక్కడా లేని ముద్రలు తెలంగాణలో వేసుడేంది? అన్నది ఇప్పుడు ప్రశ్న.

ప్రతి విషయంలోనూ ఆంధ్రోళ్లు అంటూ అవమానించే కల్చర్ ను ప్రవీణ్ కుమార్ లాంటి చదువుకున్నోళ్లు ఎప్పుడు వదిలేస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడు కీరవాణి పెత్తనం అంటూ నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్న ప్రవీణ్ కుమార్.. తెలంగాణ ఆత్మ అయిన బతుకమ్మ పాటను ఏఆర్ రెహమాన్ చేత బాణీ కట్టించినప్పుడు ఈ గొంతు ఏమైంది? అప్పుడు తెలంగాణలో ప్రతిభ గురించి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు గుర్తుకు రాలేదా? అంతదాకా ఎందుకు ఇప్పుడు గులాబీ తోటలో పెద్ద సారు సేవలో తరిస్తున్న ప్రవీణ్ కుమార్.. తెలంగాణకు ప్రతీకగా యాదాద్రి దేవాలయాన్ని నిర్మిస్తున్నట్లుగా చెప్పిన కేసీఆర్.. ఆంధ్రాప్రాంతానికి చెందిన ఆనంద్ సాయిని ఆలయ డిజైన్ ప్రాజెక్టు అప్పజెప్పినప్పుడు.. ఆంధ్రోళ్ల పెత్తనమేంది? అన్న మాట రాలేదేం?

తెలంగాణకు కొత్త ఇమేజ్ తెచ్చి పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణలో ఉన్న ఎంతో మంది కాంట్రాక్టర్లను వదిలేసి.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన మెగా ఇంజనీరింగ్ కు ఎందుకు ఇచ్చారన్న మాట ప్రవీణ్ కుమార్ ఎందుకు ప్రశ్నించలేదు? ఇలా చెప్పుకుంటూ పోతే.. బోలెడన్ని కనిపిస్తాయి. అవన్నీ కూడా పెద్ద సారు హయాంలోనే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆంధ్రోళ్లు అనే మాట రాకూడదు. అదే వేరే వారు అధికారంలో ఉన్నప్పుడు.. వారు తీసుకునే నిర్ణయంలో ఆంధ్రోళ్లు అంటూ దరిద్రపుగొట్టు వాదనను ఎలా తీసుకొస్తారు?

తెలంగాణ రాష్ట్ర గీతానికి బాణీల్ని కట్టే పనిలో అస్కార్ విజేత కీరవాణి తన వంతు సహకారాన్ని అందించటం తప్పే అయితే.. అదే కీరవాణికి అస్కార్ వచ్చినప్పుడు యావత్ తెలంగాణ పులకరించిపోయింది కదా? ప్రవీణ్ కుమార్ లాంటి చిన్న మనసు ఉన్న వారు.. ఆంధ్రోడికి అస్కార్ రావటం ఏమిటని అంటే ఎలా ఉంటుంది? ఈ లెక్కన చూస్తే.. ఇదే ఆంధ్రోడు బాణీ కట్టిన నాటునాటు పాట గురించి హేళనగా మాట్లాడే ప్రవీణ్ కుమార్.. ఆ పాటను పాడిన తెలంగాణ పోరడు.. హైదరాబాద్ కుర్రోడికి ప్రపంచ వేదిక మీద గుర్తింపు లభించిందని.. ఆ పాటను రాసిన తెలంగాణ ప్రాంతానికి చెందిన చంద్రబోస్ చరిత్ర క్రియేట్ చేసిన విషయాన్ని ప్రవీణ్ కుమార్ ఎందుకు మర్చిపోతున్నారు?

ఇదంతా పక్కన పెట్టేద్దాం. తెలంగాణ ఉద్యమంలో కీలకమైన నినాదం.. విడిపోయి కలిసి ఉందామని. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా తెలుగువారంతా ఒకటేనని నినదించిన తెలంగాణ ఉద్యమ సారం మీద ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చిమ్మే విషం దేనికి నిదర్శనం? ఆయన సంకుచిత వైఖరితో ప్రజల మధ్య లేని దూరాన్ని పెంచే ప్రయత్నం తెలంగాణ సమాజానికి చేటు చేస్తుంది. తెలంగాణ ప్రజలు కోరుకున్న తెలంగాణ వచ్చింది. ప్రాంతాలుగా విడిపోయినా.. ప్రజల మధ్య ఎలాంటి అరమరికలు లేకుండా సాగుతున్నప్పుడు.. రాజకీయ కోణంలో ప్రజల మధ్య విద్వేషాన్ని పెంచేలా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి మేధావులు చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయన్న వాస్తవాన్ని మర్చిపోకూడదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లకు కూడా ఆంధ్రోళ్ల పెత్తనం ఏమిటంటూ ఈ విషం చిమ్మటం దేనికి నిదర్శనం?

Tags:    

Similar News