ఆసీస్ ఆతిథ్యం దారుణం... కెప్టెన్ పై శార్దూల్ సంచలన వ్యాఖ్యలు!

ఈ నేపథ్యంలో స్పందించిన శార్దుల్ ఠాకూర్... అప్పటి ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా అతడిని అబద్ధాల కోరుగా అభివర్ణించాడు.

Update: 2024-08-10 06:00 GMT

వచ్చే నవంబర్ నుంచి ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రాక్టీస్ మ్యాచ్ ల షెడ్యూల్ ను క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల క్రిందట సిరీస్ గురించి టీం ఇండియా ఆటగాడు శార్దుల్ ఠాకూర్ కీలక వ్యఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా క్రికెట్ ఆస్ట్రేలియా ఆతిథ్యంపైనా ఫైరయ్యాడు.

అవును... నాలుగేళ్ల కిందట టీం ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఈ సమయంలో ఆ సిరీస్ ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆ ఒత్తిడి ఈసారి వారిపై బలంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన శార్దుల్ ఠాకూర్... అప్పటి ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా అతడిని అబద్ధాల కోరుగా అభివర్ణించాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన శార్ధుల్.. నాటి పర్యతనలో తమను ట్రీట్ చేసిన విధానం అత్యంత దారుణం అని.. ఒక్కోసారి నాలుగైదు రోజులపాటు హౌస్ కీపింగ్ సేవలు కూడా ఉండేవి కావని.. ఈ విషయంపై క్రికెట్ ఆస్ట్రేలియాకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే లేడని అన్నాడు. బెడ్ షీట్ మార్చాలని కోరినా ఫలితం శూన్యం అని తెలిపాడు.

ఇదే సమయంలో నాటి ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ మాత్రం పెద్ద అబద్దాల కోరని.. అతడు ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలన్నీ అవాస్తవాలని.. తమ పొరపాట్లను కప్పిపుచ్చుకునేందుకే అలాంటి వ్యాఖ్యలు చేశాడని వెల్లడించాడు. అసలు వాస్తవాలేమిటనేది కనీస మౌళిక సదుపాయాల కోసం పోరాడిన తమకు తెలుసని వివరించాడు. నాటి అనుభవాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఆ సిరీస్ లో కెప్టెన్ గా ఉన్న కోహ్లీ స్వదేశానికి వెళ్లిన తర్వాత తాత్కాలిక కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన రహానె, హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ సమస్యలపై నిరంతరం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో పోరాడారని శార్దూల్ గుర్తుచేసుకున్నాడు. దీంతో... ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. క్రికెట్ ఆస్ట్రేలియా తీరు ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

కాగా... ఆ సిరీస్ లో ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై టీమిండియా ఓడించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ కొహ్లీ అర్ధాంతరంగా ఇండియాకు వెళ్లాల్సి వచ్చినా.. సిరీస్ లో తొలుత వెనుకబడినా.. తర్వాత పుంజుకుని 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది.

Tags:    

Similar News