ఆపరేషన్ క్లోరోహైడ్రేట్.. మహారాష్ట్రకు తెలంగాణ ఆబ్కారీ సిబ్బంది

తెలంగాణ రాష్ట్రంలో కల్తీ మద్యం, కల్తీ కల్లు అరికట్టేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. ఇప్పటికే కల్తీ మద్యంపై దృష్టి సారించగా.. దాడులు కొనసాగిస్తూనే ఉంది.

Update: 2024-10-10 05:28 GMT

తెలంగాణ రాష్ట్రంలో కల్తీ మద్యం, కల్తీ కల్లు అరికట్టేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. ఇప్పటికే కల్తీ మద్యంపై దృష్టి సారించగా.. దాడులు కొనసాగిస్తూనే ఉంది. అందులోనూ రాష్ట్రంలో దసరా పండుగ సీజన్ ఉండడంతో కల్తీ మద్యం మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ఎక్సైజ్ దాడులు, తనిఖీలు చాలావరకు పెరిగాయి. మద్యం కల్తీ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

అలాగే.. రాష్ట్రాన్ని కల్తీ కల్లు కూడా పట్టిపీడిస్తోంది. ఇప్పటికే చాలామంది కల్తీ కల్లుకు బలైన వారూ ఉన్నారు. కల్తీ బానిసలైన వారు కూడా వందల సంఖ్యలో ఉన్నారు. కల్తీ కల్లును నిర్మూలించేందుకు ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. పొరుగు రాష్ట్రాల నుంచి ముఠాలు కల్తీ కల్లు కోసం వినియోగించే క్లోరోహైడ్రేట్ తీసుకొస్తున్నారు. దాంతో కల్తీ కల్లుతయారు చేసి తాగుబోతులకు కిక్కునిస్తున్నారు. ఫలితంగా దానికి బానిసలైన వారు.. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.

ప్రధానంగా ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీలు, తదితర కార్మికులు కల్తీ కల్లుకు బానిసలవుతున్నారు. అయితే.. ఇది కేవలం నగరాలు, పట్టణాలు, గ్రామాలకే పరిమితం కాకుండా.. ఈ బెడద హైదరాబాద్ మహానగరాన్ని సైతం వేధిస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో యథేచ్ఛగా కల్తీ కల్లు తయారుచేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఎక్సైజ్ శాఖ నుంచి ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ ముఠాలు వాటిని పట్టించుకోవడం లేదు.

కల్తీ కల్లుపై మరింత ఉక్కుపాదం మోపేందుకు ఎక్సైజ్అధికారులు భారీ ఎత్తున ప్లాన్ చేశారు. అందులో భాగంగా మహారాష్ట్రపై ఫోకస్ పెట్టారు. కల్తీకల్లు కోసం వినియోగించే క్లోరోహైడ్రేట్ మహారాష్ట్ర నుంచి తెలంగాణకు తీసుకొస్తున్నారని వారి తనిఖీల్లో వెల్లడైంది. దాంతో ఆబ్కారీ వాళ్లు భారీ ఆపరేషన్ చేపట్టారు. క్లోరోహైడ్రేట్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు మహారాష్ట్రకు చేరుకున్నాయి. అక్కడే నాలుగు రోజులు నిఘా వేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు క్లోరోహైడ్రేట్ సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. గత తొమ్మిది నెలలుగా పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రామాగౌడ్ అనే ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. అతడిని కస్టడీలోకి తీసుకొని విచారించగా.. ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. అందులో భాగంగా ఎక్సైజ్ సిబ్బంది మహారాష్ట్ర ఈ ఆపరేషన్ నిర్వహించాయి.

Tags:    

Similar News