ఇప్పుడు వల్లభనేని వంశీ పరిస్థితి ఏమిటి?
అయితే... గన్నవరంలో వంశీకి పరిస్థితులు అంత అనుకూలంగా లేవని.. సర్వే ఫలితాలు సానుకూలంగా లేవని నివేదికలు వచ్చాయంట.
టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ వైసీపీ వర్గాల్లో నడుస్తుంది! ఇందులో భాగంగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భవిష్యత్ ప్రశ్నార్థకం అయ్యిందనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో ఆయన అలకబూనారని.. అనుచరులకు సైతం అందుబాటులో లేరని అంటున్నారు! దీంతో.. అసలు ఏమైంది? అనే విషయం ఇప్పుడు చర్చనీఇయాంశం అయ్యింది!
అవును... టీడీపీ కంచుకోటగా చెప్పే గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ.. ఆ పార్టీ నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో జగన్ వేవ్ లో సైతం గన్నవరంలో పసుపు జెండా ఎగరేశారు. అయితే తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీలో రెబల్ ఎమ్మెల్యేగా మారాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతుంటారు. దీంతో కొడాలి నానితో సాన్నిహిత్యంగా ఉండే వంశీ వైసీపీ వైపు చూశారు!
దీంతో... గత ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ నుంచి వంశీపై పోటీ చేసి 838 ఓట్ల తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు పార్టీని వీడారు.. సైకిల్ ఎక్కారు! దీంతో వెంటనే వెంకట్రావుని గన్నవరం ఇన్ ఛార్జ్ గా ప్రకటించారు చంద్రబాబు. ఈ సమయంలో ఈసారి వైసీపీ నుంచే వల్లభనేని వంశీ పోటీకి దిగుతారని అంతా భావించారు. అయితే... గన్నవరంలో వంశీకి పరిస్థితులు అంత అనుకూలంగా లేవని.. సర్వే ఫలితాలు సానుకూలంగా లేవని నివేదికలు వచ్చాయంట.
దీంతో... "వంశీకి గన్నవరం టిక్కెట్"అనే విషయంలో ఒక క్లారిటీకి వచ్చిన సీఎం జగన్... వల్లభనేని వంశీతో పాటు కొడాలి నానీని పిలిపించుకుని మాట్లాడారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... గన్నవరంలో వంశీని అనుకూల వాతావరణం లేదని, సర్వేల్లోనూ సానుకూల ఫలితాలు రాలేదని చెప్పినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో గన్నవరం కాకుండా మరో రెండు చోట్ల జగన్ ఆఫర్ చేశారని అంటున్నారు.
ఇందులో భాగంగా... మైలవరం లేదా పెనమలూరులలో ఏదో ఒక చోట నిలబడాలని వల్లభనేని వంశీని సీఎం జగన్ కోరినట్టు తెలిసింది. వంశీ సరేనంటే... ఆ రెండు నియోజకవర్గాల్లోనూ మార్పులు చేర్పులు చేపడతానని కూడా జగన్ చెప్పారని అంటున్నారు. అయితే ఈ ఆఫర్ కు వంశీ అంగీకరించలేదని సమాచారం. దీంతో సీఎం భేటీ తర్వాత వంశీ సెల్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తుందని.. ఎవరికీ అందుబాటులోకి రావడం లేదని చర్చ జరుగుతుంది. దీంతో... వంశీ పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న గన్నవరంలో మొదలైంది!!
కాగా... గన్నవరంలో 2014 ఎన్నికల్లో 9,548 ఓట్ల మెజారిటీతో గెలిచిన వల్లభనేని వంశీ.. 2019కి వచ్చేసరికి 838 ఓట్ల మెజారిటీకి పరిమితమయ్యారు. అయితే 2024లో అలాంటి పాజిటివ్ ఫలితాలు వచ్చేలా కనిపించడం లేదని జగన్ చెప్పారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వంశీ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది వేచి చూడాలి!!