నన్నేం చేస్తారు: వంగవీటి అల్టిమేటం.. !
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన రాధా.. పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది.;

వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన రాధా.. పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఒకప్పుడు డిమాండ్ చేసి టికెట్లు దక్కించుకున్న ఈ కుటుంబం.. ఇప్పుడు చిన్నపాటి పదవుల కోసం వెంపర్లాడే పరిస్థితి వచ్చిందని.. రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా రాధా సీఎం చంద్రబాబును రెండు సార్లు కలుసుకున్నారు. గురువారం, బుధవారం రెండు రోజులు కూడా.. ఆయన అత్యంత రహస్యంగా చంద్రబాబుతో భేటీ అయ్యారు.
గత ఎన్నికల్లోనే టికెట్ ఆశించినప్పటికీ.. ఆయన విజయం దక్కించుకునే అవకాశం లేదన్న సర్వే రిపోర్టుల ఆధారంగా.. చంద్రబాబు వంగవీటి వారసుడిని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో కేవలం ప్రచారాని కి మాత్రమే పరిమితమయ్యారు. అయితే.. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు మాత్రం యాక్టివ్గానే పనిచేశారన్నది వాస్తవం. ఆ తర్వాత.. కూటమి ప్రభుత్వం ఏర్పడినా.. రాధాకు ఆశించిన మేరకు గుర్తింపు అయితే రాలేదు.
ఇక, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తనకు నామినేటెడ్ పదవి అయినా.. దక్కుతుందని ఆయన ఆశించా రు. కానీ.. ఇప్పటి వరకు అది కూడా ఇవ్వలేదు. ఇదిలావుంటే.. రంగా-రాదా మిత్ర మండలి సహా.. కాపు సామాజిక వర్గం నుంచి రాధా విషయంలో వ్యక్తిగత సెగ పెరుగుతోంది. ఇన్నిపదవులు ఇచ్చినా.. ఒక్కటి కూడా దక్కించుకోలేక పోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఆదిలో రాజ్యసభ అంటూ.. కొంత ప్రచారం జరిగింది. తర్వాత.. మండలికి పంపిస్తున్నారని ప్రచారం తెరమీదకి వచ్చింది.
ఇదే జరిగి ఉంటే.. రాధా కొంత మేరకు పుంజుకునేవారు.కానీ, ఆయనకు ఆ అవకాశం కూడా దక్కలేదు. ఈ పరిణామాల క్రమంలోనే రాధా.. తాజాగా చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరో 50 వరకు మార్కెట్ కమిటీలకు చైర్మన్లను నియమించేందుకు కసరత్తు సాగుతున్న సమయంలో రాధా వెళ్లి చంద్రబాబును కలుసుకోవడం ద్వారా ఈ పదవులను ఆయన కోరుతున్నట్టు ప్రచారం ఉంది. అయితే.. వీటికి ప్రాధాన్యం లేదని.. కాబట్టి.. ఇవి తీసుకున్నా.. ఇబ్బందేనని అంటున్నారు. మరి ఏం చేస్తారోచూడాలి.