వైసీపీ ఓల్డ్ ట్రిక్స్ : పాత సీసాలో పాత సారా

చాలా మంది చేసేది అదే కూడా. నాలుగున్నర దశాబ్దాల పార్టీ టీడీపీలో చూస్తే పాత సీసా అయినా కొత్త సారాయే ఉంది.

Update: 2024-10-05 05:17 GMT

కొత్త సీసాలో పాత సారా కలిపినా కనీసం సీసాను చూసి అయినా కొంతమంది మోజు పడతారు. చాలా మంది చేసేది అదే కూడా. నాలుగున్నర దశాబ్దాల పార్టీ టీడీపీలో చూస్తే పాత సీసా అయినా కొత్త సారాయే ఉంది. అంతా న్యూ వేవ్ కనిపిస్తోంది.

కానీ పుష్కర కాలం క్రితం పుట్టిన వైసీపీలో ఎక్కడా కొత్తదనం కనిపించడం లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలనే కంటిన్యూ చేస్తున్నారు. జనాలకు మొహం మొత్తిన వారినే ముందు పెట్టి యుద్ధానికి సిద్ధం అంటున్నారు. రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో ఆయన నేతల నిర్వాకం కూడా ఓటమిలో ముఖ్య భూమిక పోషించింది అని తెలిసినా కూడా వారినే తెచ్చి అధినాయకత్వం మళ్లీ జిల్లా బాధ్యులుగా ముందు పెడుతోంది.

పార్టీ అధికారంలో ఉంటే వారే మంత్రులు సామంతులు. పార్టీ ఓడినా వారినే జిల్లా అధ్యక్షులుగా చేస్తున్నారు. దాంతో క్యాడర్ లోనే ముందు జోష్ పోతోంది అని అంటున్నారు. వీరిలో అత్యధికులు తమ ఏకపక్ష విధానాలతో ప్రభుత్వంలో ఉన్నపుడు హవా చలాయించారని కూడా క్యాడర్ నుంచి విమర్శలు ఉన్నాయి.

అలాగే పార్టీని నాడు పట్టించుకోలేదని ఇపుడు వారిని సేఫ్ హ్యాండ్స్ గా చూపించి పార్టీని నడిపించమని చెబితే నిజంగా జరిగే పనేనా అని డౌట్లు కూడా వ్యక్తం చేస్తున్నారు. కేవలం జిల్లా బాధ్యులే కాదు రాష్ట్ర నాయకత్వం లో కొత్త వారిని ప్రోత్సహించకుండా పాత వారినే తెస్తున్నారు అని అంటున్నారు

మరో వైపు చూస్తే గతంలో రాష్ట్ర స్థాయిలో కొందరి వల్లనే పార్టీ ఇబ్బందులలో పడిందని వారి వల్లనే అధినాయకత్వానికి క్యాడర్ కి మధ్య బిగ్ గ్యాప్ ఏర్పడింది అని ప్రచారం సాగింది. ప్రభుత్వంలో వారి పాత్ర ఎక్కువ అయి అన్నీ వారే అయి మీడియా ముందుకు వచ్చి చెబుతూ వైసీపీని ఇరుకున పెట్టారు అని కూడా అంటారు.

ఇపుడు మళ్లీ వారినే పక్కన పెట్టుకున్నారని అంటున్నారు. దీంతో పాటు గా ఏ ఐప్యాక్ టీం ని అయితే నమ్మి సర్వం దెబ్బ తిన్నారో ఆ ఐప్యాక్ టీం ని మళ్లీ పిలిచి బాధ్యతలు అప్పగిస్తున్నారు అని టాక్ అయితే నడుస్తోంది. వారిని వైసీపీ అనుబంధ విభాగాలలో వైసీపీకి ఉపయోగపడేలా చూసేందుకు వినియోగించుకోవాలనుకుంటున్నారని టాక్.

అంతే కాదు వారి ద్వారా వైసీపీ ఎలా జనంలోకి వెళ్ళి అధికార టీడీపీ కూటమి మీద ప్రచారం చేయవచ్చో కార్యక్రమాలను డిజైన్ చేసే బాధ్యతలు అప్పగిస్తున్నారు అని కూడా ప్రచారం సాగుతోంది. ఇలా అంతా పాతావారే పాత విధానాలే అయినపుడు భారీ ఓటమి నుంచి వైసీపీ ఏమి నేర్చుకుంది అన్నది చర్చకు వస్తోంది

అయితే వైసీపీ హై కమాండ్ ధైర్యం ఏంటి అంటే టీడీపీ కూటమి వ్యతిరేకతనే తమను గెలిపిస్తుంది అని. అయిదేళ్ల తమ పాలన బాగున్నా జనాలు టీడీపీ హామీలకు ఆకర్షితులై ఆ వైపుగా ఓటు వేశారు తప్ప తమను కావాలని ఓడించలేదని. ఈ విధంగా గాఢమైన అభిప్రాయాలు అయితే వైసీపీ పెద్దలలో ఉన్నాయట.

దాంతో పాత వారు అయితేనేమి పార్టీని జగన్ అన్న ప్రధాన ఆకర్షణ చాలదా అనే వారూ ఉన్నారు. కూటమి మీద వెల్లువలా వ్యతిరేకత వచ్చినపుడు దానిని ఒడిసిపట్టేది వైసీపీ తప్ప ఎవరూ కాదు కాట్టే 2029లో తమ విజయం గ్యారంటీ అని కూడా భావిస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి వైసీపీ ఏ రకంగా తన స్ట్రాటజీలను అమలు చేస్తుందో.

Tags:    

Similar News