వైసీపీ కీలక నేతలకు సుప్రీంకోర్టు ఊరట!

వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేసి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-13 09:10 GMT

వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేసి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో వారిపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో నాటి ఘటనలో పాత్రధారులు, సూత్రధారులను అరెస్టు చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్, విజయవాడ డిప్యూటీ మేయర్‌ అవుతు శైలజ భర్త అవుతు శ్రీనివాసరెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.

ఇదే ఘటనలో నిందితులుగా ఉన్న విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాష్, వైసీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, తదితరులు తమకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు తిరస్కరించింది. దీంతో వారు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వారికి ఊరట కల్పించింది. దేవినేని అవినాశ్, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి తదితరులకు ముందస్తు బెయిల్‌ ఇస్తున్నట్టు ప్రకటించింది.

అలాగే ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపైకి అప్పట్లో దాడికి వెళ్లినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌ కు సైతం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ ఇచ్చింది. జోగి సైతం ముందు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ముందస్తు బెయిల్‌ ఇవ్వడానికి హైకోర్టు అంగీకరించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జోగి రమేశ్‌ కు సైతం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ ఇచ్చింది.

ముందస్తు బెయిల్‌ ఇచ్చిన సందర్భంగా సుప్రీంకోర్టు వైసీపీ నేతలకు పలు ఆంక్షలు విధించింది. వారు తమ పాస్‌ పోర్టులను పోలీసులకు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే దర్యాప్తునకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను నవంబర్‌ 4కి కోర్టు వాయిదా వేసింది.

కాగా వైసీపీ నేతల తరఫున సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాదులు.. కపిల్‌ సిబల్, నీరజ్‌ కిషన్‌ కౌశల్, అల్లంకి రమేష్‌ తమ వాదనలు వినిపించారు. 2021లో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు అక్కడ వైసీపీ నేతలెవరూ లేరని కోర్టుకు నివేదించారు. కూటమి ప్రభుత్వం రాగానే కక్ష సాధించడంలో భాగంగానే వైసీపీ నేతలపై కక్ష పెట్టిందని తెలిపారు. ఘటన జరిగిన మూడేళ్ల తర్వాత ఈ కేసులో కొత్తగా కేసులు పెడుతోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వల్ప ఘటనకు 307లాంటి హత్యాయత్నం కింద కేసులు పెట్టారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల నుంచి వైసీపీ నేతలకు రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టును కోరారు. వీరి వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.

Tags:    

Similar News