భూమా ఫ్యామిలీలో భారీ కుదుపు!

Update: 2019-07-25 07:21 GMT
అధికారం చాలా చెడ్డదంటారు. నాయకులంతా ఓడిన పార్టీలో ఉండడానికి ఇష్టపడరు.. అందుకే గెలిచిన పార్టీలోకి వలసలు వెళ్లడానికి వెంపర్లాడుతారు. అధికారం చేజిక్కించుకుంటారు. ఇప్పుడు అధికారం కోసం పార్టీలు మారుతున్న వైనం భూమా ఫ్యామిలీలో చిచ్చు పెట్టింది.

కర్నూలు జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబంగా భూమా ఫ్యామిలీ పేరొందింది. నాగిరెడ్డి మరణం తర్వాత గత ప్రభుత్వంలో భూమా అఖిలప్రియ మంత్రిగా పట్టు నిలుపుకున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ధాటికి ఓడిపోవడంతో కథ మొదటికి వచ్చింది. వైసీపీలోనే గెలిచి చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ కు పార్టీ మారిన అఖిలప్రియకు ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోయి పుట్టెడు కష్టాలు వచ్చిపడ్డాయి.

తాజాగా భూమా ఫ్యామిలీ నిట్టనిలువునా చీలింది. ఆ ఫ్యామిలీ నుంచి మరో నేత ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. భూమా అఖిలప్రియకు సోదరుడైన భూమా కిషోర్ రెడ్డి రాజకీయాల్లోకి అరంగేట్రం ఇస్తున్నాడు. భూమా నాగిరెడ్డి అన్న కుమారుడే భూమా కిశోర్ రెడ్డి.  

తాజాగా భూమా కిషోర్ రెడ్డి.. సోదరి అఖిలప్రియను కాలదన్ని రక్తసంబంధీకులు - ఇతర అనుచరులతో ఢిల్లీకి పయనమయ్యారు. ఆయన బీజేపీలో చేరబోతున్నారు. భూమా ఫ్యామిలీలోని ప్రముఖులంతా అతడి వెంట ఉండడం అఖిలప్రియకు షాక్ లా మారింది.

ఇప్పటికే ఆళ్లగడ్డలో భూమా ఫ్యామిలీకి ప్రధాన శత్రువులుగా గంగుల ఫ్యామిలీ బలంగా తయారైంది.  వారు వైసీపీ తరుఫున గెలిచి అధికారంలో ఉన్నారు. బీజేపీ తరుఫున భూమా కిషోర్ రెడ్డి ఎంట్రీతో ఆళ్లగడ్డలో ఇప్పుడు త్రిముఖ పోరు అనివార్యంగా ఉంది.   ఆళ్లగడ్డ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది.
Tags:    

Similar News