మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్.. బీసీలపై జగన్ కక్ష కట్టారన్న చంద్రబాబు!

Update: 2021-03-11 05:15 GMT
నిన్న రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని,  విధి నిర్వహణలో వున్న ఎస్ ఐ పై చేయిచేసుకున్నారన్న ఆరోపణలతో  టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఈ రోజు ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లిన తనపై పోలీసులు దురుసుగా ప్రవర్తించాంటూ కొల్లు రవీంద్ర నిన్న మచిలీపట్నం జలాల్‌ పేటలోని పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించి నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ ఏజెంట్లు ఆయనతో వాగ్వివాదానికి దిగారు. కల్పించుకున్న పోలీసులు రవీంద్రను వెళ్లిపోవాలని సూచించారు. దీంతో రవీంద్ర మండిపడ్డారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తోపులాట కూడా జరిగింది.

గెలుపు కోసం పేర్ని నాని విష సంస్కృతికి శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. ఈ  నేపథ్యంలో ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారంటూ రవీంద్రపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్నారు.  రవీంద్రను మచిలీపట్నంలోని నివాసంలో అరెస్ట్ చేసి.. ఇనుకుదురు పోలీస్ స్టేషన్‌కి తరలించారు. విషయం తెలిసిన టీడీపీ కార్యకర్తలు కొల్లు నివాసానికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు రవీంద్ర అరెస్ట్‌ ను టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను లక్ష్యంగా చేసుకుందని, పండుగ రోజు కూడా వారిని సంతోషంగా ఉండనివ్వడం లేదని మండిపడ్డారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గూండాయిజాన్ని ఎదిరించినందుకే బీసీలపై కక్షకట్టారా..  అని ప్రశ్నించారు. రవీంద్ర చేసిన నేరమేంటని నిలదీశారు. పోలింగ్ బూతుల్లోకి వెళ్లి దొంగ ఓట్లు వేసుకున్న వైసీపీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
Tags:    

Similar News