కేసీఆర్ మాటే..హ‌రీశ్ రావు మాట‌

Update: 2018-03-20 17:53 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇటీవ‌లి కాలంలో జాతీయ రాజ‌కీయాల‌వైపు ఆస‌క్తి కేంద్రీక‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వం తీరుపై విరుచుకుప‌డుతున్నారు. నిధుల విష‌యంలోనూ ఢిల్లీ పాల‌కుల తీరును త‌ప్పుప‌డుతున్నారు. అదే స‌మ‌యంలో థ‌ర్డ్ ఫ్రంట్ ప్ర‌య‌త్నాల‌ను కొన‌సాగిస్తున్నారు. అలా గులాబీ ద‌ళ‌ప‌తి సాగుతున్న బాట‌లోనే ఆయ‌న మేన‌ల్లుడు - రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు న‌డుస్తున్నారు. తాజాగా శాసనమండలిలో ఆయన మాట్లాడుతూతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు.

చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిష‌న్ కాక‌తీయ కార్యక్రమానికి 5 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని మంత్రి హ‌రీశ్ రావు తెలిపారు. అయితే కేంద్రం స్పందించలేదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ తో పాటు తాను కూడా పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేదన్నారు. ఈ తీరును గ‌మ‌నించాల‌ని కోరారు. కేంద్రం స‌హ‌క‌రించ‌న‌ప్ప‌టికీ తాము విజ‌య‌వంతంగా ముందుకు సాగుతున్నామ‌ని హరీశ్ రావు తెలిపారు. మిషన్ కాకతీయ కార్యక్రమం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని మంత్రి తెలియజేశారు. మిషన్ కాకతీయ వల్ల చెరువుల పునరుద్ధరణ కారణంగా కృష్ణా బేసిన్ లో 89 టి.ఎం.సి.లు, గోదావరి బేసిన్ లో 165 టి.ఎం.సీల సామర్థ్యం పెరిగినట్టు మంత్రి హరీశ్ రావు చెప్పారు. దేశ, విదేశాల నుంచి మిషన్ కాకతీయ పథకానికి ప్రశంసలు అందుతున్నట్టు తెలిపారు. మహారాష్ట్ర, పాండిచ్చేరి రాష్ట్రాలలో కూడా మిషన్ కాకతీయ అమలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

మిష‌న్ కాక‌తీయ కార్యక్రమం అమలు తీరును శాస్త్రీయంగా అధ్యయనం చేసిన నాబార్డు కు చెందిన NABCON  నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్టు హరీశ్ రావు చెప్పారు. మిషన్ కాకతీయ మొదటి దశలో ఎంపిక చేసిన చెరువులున్న గ్రామాల్లో చెరువుల కింద ఆయకట్టు రైతాంగ కుటుంబాల్లో సర్వే - వారితో చర్చలు - ఉపగ్రహ చిత్రాల పరిశీలన  - విశ్లేషణ  - కొన్ని చేరువులపై  కేస్ స్టడీ ఇతరత్రా లభ్యమయ్యే సమాచారం ఆధారంగా మిషన్ కాకతీయ ప్రభావాలను ఆ సంస్థ అధ్యయనం  చేసినట్లు హ‌రీశ్ రావు వివ‌రించారు.

Tags:    

Similar News