నీర‌వ్‌ - మాల్యా ఎస్కేప్‌ ను పాఠాలుగా చెప్తార‌ట‌!

Update: 2018-06-26 07:57 GMT
బ్యాంకింగ్ రంగాన్ని అతలాకుతలం చేసిన నీరవ్ మోడీ - విజయ్ మాల్యా అనూహ్య రీతిలో తెర‌మీద‌కు రానున్నారు. ఈ బ్యాంకు మోసగాళ్లు ఆ మోసాల‌ను ఎలా చేశారో అనేవి ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌ మెంట్(ఐఐఎం) - ఎక్స్‌ ల్ ఆర్ ఐ జంషేడ్‌ పూర్ - ఎస్‌ పీజేఐఎంఆర్ ముంబై యూనివర్సిటీల్లో చదుకుంటున్న విద్యార్థులకు బోధించనున్నారట‌. పీఎన్‌ బీలో జరిగిన భారీ కుంభకోణం - విజయ్ మాల్యా రుణ ఎగవేతలు మాత్ర‌మే కాకుండా ఉబర్‌ లో జరిగిన మోసాలు - కార్పొరేట్ గవర్నెన్స్‌ పై ఇన్ఫోసిస్‌ లో జరిగిన దానిపై ఉటంకిస్తూ బిజినెస్ స్కూల్స్ ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. అంత‌టి పేరొందిన విశ్వవిద్యాలయాలు. వాటిలో చెప్పేవి మోసాల గురించి. ఇదేదో తప్పు అనుకునేరు. నీతి - కార్పొరేట్ సంస్థల్లో పరిపాలన - సామాజిక బాధ్యత(సీఎస్ ఆర్) వాటిపై ప్రత్యేకంగా కోర్సులు అందుబాటులోకి ఈ బిజినెస్ స్కూళ్లు తీసుకురాబోతున్నాయి.

ఉబర్‌ లో తీవ్ర ఆరోపణలు రావడంతో కంపెనీ ఫౌండర్ - సీఈవో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. నీరవ్ మోడీ - ఆయన మేనమామ మెహుల్ చోక్సీలు దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకైన పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.14 వేల కోట్లు మోసం చేయడం - అనూహ్య పరిణామాల మధ్య విశాల్ సిక్కా ఇన్ఫోసిస్ సీఈవో పదవికి రాజీనామా చేయడం - విజయ్ మాల్యా పలు బ్యాంకులకు రుణాలు చెల్లించకపోవడం వంటి అంశాలపై - వాటికి సంబంధించిన కేసులపై అధ్యాపకులు పాఠాలు చెప్పనున్నారు. ఈ మోసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఈ నూతన కోర్సులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఐఐఎం బెంగళూరు చైర్‌ పర్సన్ పద్మిని శ్రీనివాసన్ ఈ సందర్భంగా తెలిపారు.

ప్రముఖ డైమండ్ వ్యాపారి నీరవ్ మోడీ - లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా పలు బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరిపై దేశంలో ఉన్న టాప్ బిజినెస్ స్కూల్స్‌ లో ప్రత్యేక కోర్సులను ప్రవేశపెట్టడానికి ఇప్పటికే కసరత్తును ప్రారంభించాయి. ఇలాంటి మోసాలు జరుగకుండా ముందుగా చర్యలు తీసుకునేదానిపై ప్రధానంగా విద్యార్థులకు బోధించనున్నారు. అయితే ఈ నూతన కోర్సులు ప్రవేశపెట్టాలంటే ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాలను మార్పు చేయాల్సి ఉంటుందని, అప్పుడే విద్యార్థుల్లో చైతన్యం కలిగే అవకాశం ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ బిజినెస్ స్కూల్స్‌ లో ఒకటైన ఎక్స్ ఎల్ ఆర్ ఐ జంషేడ్‌ పూర్‌ లో కనీసం 30 బిజినెస్ కేసులకు సంబంధించి విద్యార్థులకు వివరించనున్నారు.

Tags:    

Similar News