ఆ నిందితుడిపై కేటీఆర్ ట్వీట్ వివాదంగా మారిందెందుకు?

Update: 2021-09-15 04:04 GMT
సున్నితమైన అంశాల విషయంపై స్పందించే వేళ.. ఆచితూచి అన్నట్లుగా ఉండాలి. మరేం జరిగిందో కానీ.. ఎప్పుడూ తప్పులు చేయని మంత్రి కేటీఆర్ తాజాగా తప్ప చేసి అడ్డంగా బుక్ అయ్యారు. విపక్షాలకు టార్గెట్ అయ్యారు. మంత్రిగారు.. నిందితుడు ఎక్కడా? అంటూ ప్రశ్నిస్తున్న వైనానికి సమాధానం చెప్పలేని ఇబ్బందికర పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రికేటీఆర్ ఇప్పుడున్నారు. ఇంతకూ అసలేం జరిగిందంటే..

హైదరాబాద్ నడిబొడ్డున ఉండే సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరేళ్ల చిన్నారిని చాక్లెట్ ఆశ చూపించి.. దారుణంగా అత్యాచారం చేసిన హత్య చేసిన వైనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారటం తెలిసిందే. ఈ దారుణానికి కారణమైన నిందితుడ్ని గంటల వ్యవధిలోనే పట్టుకున్నారని మంత్రి కేటీఆర్ ఈ నెల 12న ట్వీట్ చేయటం వివాదంగా మారింది. ఎందుకంటే.. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు మంత్రి కేటీఆర్ మాటలు చెబుతుంటే.. అందుకు భిన్నంగా మంగళవారం సాయంత్రం హైదరాబాద్ పోలీసులు మాత్రం.. హత్యాచార నిందితుడి ఆచూకీ చెబితే రూ.10లక్షల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు.

దీంతో.. నిందితుడు ఎప్పుడో పట్టుబడినట్లుగా స్వయంగా మంత్రి కేటీఆర్ ప్రకటించిన తర్వాత.. ఇంకా అతడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు ప్రకటించటంతో వివాదం మొదలైంది. దీంతో ఈ వివాదంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. నిందితుడి అరెస్టుపై తనకు తప్పుడు సమాచారం వచ్చిందని.. దాని ఆధారంగా ట్వీట్ చేశానంటూ విచారం వ్యక్తం చేశారు.

నిందితుడు ఇంకా పరారీలో ఉన్నారని.. పట్టుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నట్లు చెప్పారు. నిందితుడ్ని త్వరగా పట్టుకొని.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అందరం కృషి చేద్దామని పేర్కొనటం గమనార్హం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేటీఆర్ ట్విట్టర్ ఖాతాను హ్యాండిల్ చేసే సిబ్బంది పొరపాటుతో ఈ గందరగోళం చోటు చేసుకుందని చెబుతున్నారు. దీంతో.. ఆయన వివరణ ఇవ్వాల్సి వచ్చిందని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన స్థానంలో ఉన్న కేటీఆర్ లాంటి వారి ట్విట్టర్ ఖాతాలో కీలక అంశానికి సంబంధించిన సమాచారం తప్పులు దొర్లటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
Tags:    

Similar News