'తుపాకీ' చెప్పినట్టే.. జడ్డూ టైమ్ ఆయా.. సీఎస్ కే కెప్టెన్ బన్ గయా..

Update: 2022-03-25 05:35 GMT
సరిగ్గా 15 రోజుల కిందట "తుపాకీ"చెప్పినట్టే నేడు జరిగింది. టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టైమ్ నడుస్తోందని అన్నట్లే అతడిని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ వరించింది. మహేంద్ర సింగ్ ధోని అకస్మాత్తుగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో జడేజాకు పగ్గాలు  దక్కాయి. ఆ మేరకు సీఎస్కే యాజమాన్యం ట్విటర్ లో తెలిపింది. లీగ్ ప్రారంభానికి ఒక్క రోజు ముందు.. అది కూడా తొలి మ్యాచ్ ఆడాల్సిన సీఎస్కే సారథ్యంలో ఒక్కసారిగా మార్పు. ఊహించినట్లే మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా సభ్యుడు, అద్భుత ఫామ్ లో ఉన్న రవీంద్ర జడేజాను కెప్టెన్సీ వరించింది. పరిస్థితులు చూస్తుంటే.. నిజంగానే జడ్డూ టైమ్ అనాలనిపిస్తోంది.

క్రికెట్ లో ఏ ఫార్మాట్ లో అయినా జడేజా కెప్టెన్ కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. రంజీల్లోనూ అతడు కెప్టెన్ గా వ్యవహరించిన సందర్భాలు లేవు. బ్యాట్ పడితే పరుగుల  ప్రవాహం.. బంతి అందుకుంటే వికెట్ల వరద.. ఫీల్డింగ్ లోనూ తిరుగులేదు.. ఇటీవలి కాలంలో అంతా జడేజా మాయే. శ్రీలంకతో తొలి టెస్టులో జడేజా 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సైతం భారీ స్కోరు చేయలేకపోయినచోట ఏకంగా సెంచరీనే బాదేసి నాటౌట్ గా మిగిలాడు. రెండు ఇన్నింగ్స్ లో కలిపి 9 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకతో టి20 సిరీస్ లోనూ జడ్డూ అద్భుతంగా రాణించాడు.  అంతకుముందు గాయంతో జట్టుకు దూరమైనా.. వచ్చీ రాగానే దుమ్మ రేపాడు.
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్ అతడే..

ఐసీసీ తాజాగా వెల్లడించిని ర్యాంకుల్లో జడేజా టెస్టు ఫార్మాట్‌ ఆల్‌రౌండర్‌ విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 2017 ఆగస్టులోనూ ఇతడు ఓసారి టాప్ లోకి వచ్చాడు. అయితే, వారం పాటు మాత్రమే కొనసాగాడు. తాజా ర్యాంకింగ్స్లో  బ్యాటింగ్‌ విభాగంలో 17 స్థానాలు ఎగబాకి 37వ ర్యాంకులోకి, బౌలింగ్‌ విభాగంలో 17వ ర్యాంకు దక్కించుకున్నాడు. మరో ఆల్ రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్‌ విభాగంలో టీమ్‌ఇండియా కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (5), రోహిత్‌ శర్మ (6), రిషభ్‌ పంత్ (10) స్థానాలు దక్కించుకున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ (2), జస్ప్రీత్ బుమ్రా (10) స్థానాల్లో నిలిచారు.

మూడేళ్ల క్రితం వరకు సాధారణమే 2019 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా జడేజాపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరూ చూశారు. బిట్స్ అండ్ పీసెస్ ఆటగాడంటూ జడేజాపై మాట జారాడు మంజ్రేకర్. తర్వాత నాలుక్కర్చుకుని క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఇదే కప్ సెమీఫైనల్లో జడేజా అద్భుత ఇన్నింగ్స్ తో జట్టును దాదాపు గెలిపించినంత పని చేశాడు. కాగా, జడేజా ప్రతిభావంతుడే అయినా.. 2019 వరకు అతడికి దక్కిన గౌరవం అంతంతే. స్వదేశంలో అయితే స్పిన్ పిచ్ లు కాబట్టి అతడికి టెస్టు జట్టులో చోటు కచ్చితంగా ఉండేది. విదేశాల్లో మాత్రం ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ తర్వాతనే జడేజా గురించి ఆలోచించేవారు. అలాంటి జడేజా మూడేళ్లుగా మరింత రాటుదేలాడు. ఇప్పుడు మూడు జట్లలోనూ అతడికి తుది 11 మందిలో స్థానం ఖాయంగా ఉంటోంది. ఇక్కడ ఎక్కువగా చెప్పుకోవాల్సింది జడ్డూ బ్యాటింగ్ గురించి. 2019 తర్వాత అతడి బ్యాటింగ్ మరో స్థాయికి వెళ్లింది.


ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మూడు ట్రిపుల్ సెంచరీలు2008 ప్రపంచ కప్ గెలిచిన అండర్ 19 జట్టు సభ్యుడైన జడేజా.. కోహ్లి కంటే ఏడాది ఆలస్యంగా 2009లో టీమిండియాలోకి వచ్చాడు. కానీ.. కొన్నేళ్లపాటు తనదైన ముద్ర చూపలేకపోయాడు. తర్వాత జట్టుకు దూరమయ్యాడు. వస్తూ పోతూ ఉండసాగాడు. ఆ సమయంలో జట్టు కూర్పు కూడా అలానే ఉండేది. టీంకు పూర్తిగా దూరమైన స్థితిలో 2017 సంవత్సరం అతడి జాతకం మార్చింది. రీ ఎంట్రీలో దుమ్మురేపిన జడేజా టీమిండియాలో సుస్థిర స్థానం ఏర్పర్పుకున్నాడు. ఎలాగూ ఫీల్డింగ్ లో తిరుగులేనివాడు కావడం అదనపు బలంగా మారింది.

చెన్నై సూపర్ కింగ్స్ కే కాదు.. టీమిండియా భవిష్యత్ సారథిగానూ..జడేజాను ఈ ఏడాది ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ రూ.16 కోట్లతో రిటైన్ చేసుకుంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి రూ.12 కోట్లు మాత్రమే ఇచ్చిన చెన్నై.. జడేజాకు అంతకుమించి ఇవ్వడం గమనార్హం. సీఎస్కే చరిత్రలో ధోనికి మించి ఓ ఆటగాడికి ఎక్కువ డబ్బులివ్వడం ఇదే తొలిసారి. కాబట్టి సీఎస్కే తదుపరి కెప్టెన్ జడేజానే అని తుపాకీ అప్పుడు చెప్పింది. ఫామ్ ఇలాగే కొనసాగితే టీమిండియాకూ అతడే భవిష్యత్ సారథి అనడంలో సందేహం లేదు. 34 ఏళ్ల కెప్టెన్ రోహిత్ శర్మ తర్వాత జడేజాకే ఎక్కువ అవకాశాలున్నాయి.
Tags:    

Similar News