పాక్ జర్నలిస్ట్‌ ‘వివాదాస్పద ప్రశ్న’..సమాధానం చెప్పేందుకు నిరాకరించిన అఫ్గాన్ కెప్టెన్ !

Update: 2021-10-30 12:36 GMT
టి 20 ప్రపంచ కప్ మ్యాచులు చాలా రసవత్తకరంగా సాగుతున్నాయి. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో పాకిస్తాన్ చివరికి విజయం సాధించింది. ఓ దశలో అఫ్గాన్ విజయం సాధిస్తుందని అనుకున్నప్పటికీ ఆ తర్వాత పాక్ ఆటగాళ్ల మెరుపులతో పాక్ విజయం ఖరారైంది. మ్యాచ్ అనంతరం అఫ్గాన్ కెప్టెన్ మొహమ్మద్ నబీ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అయితే పాకిస్తాన్‌కు చెందిన ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించాడు.

ప్రభుత్వం మారింది, పరిస్థిలు మారాయి. మీరు తిరిగి అఫ్గాన్‌ వెళ్లాక, ఎందుకు ఓడిపోయారని మిమ్మల్ని అడుగుతారని ఏదైనా భయంగా ఉందా, కొత్త శకం ప్రారంభమైంది. పాకిస్తాన్‌ తో సంబంధాలు బాగుంటే, అఫ్గానిస్తాన్ జట్టు మరింత బలపడుతుందని భావిస్తున్నారా అని ప్రెస్ కాన్ఫరెన్స్‌ లో ఒక పాకిస్తానీ జర్నలిస్ట్ నబీని అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు మొహమ్మద్ నబీ నిరాకరించాడు. ఇలాంటి ప్రశ్నలను వదిలేసి క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడుకుందామా అని చెప్పాడు. క్రికెట్ గురించి మాట్లాడగలిగితే మంచిది. వరల్డ్‌ కప్‌ కోసం ఇక్కడికి వచ్చాం. పూర్తి సన్నద్ధతతో, పూర్తి నమ్మకంతో వచ్చాం. క్రికెట్‌ కు సంబంధించిన ప్రశ్నలుంటే మీరు అడగండి అని చెప్పాడు.

పాకిస్తాన్‌ తో సత్సంబంధాల వల్ల భవిష్యత్తులో అఫ్గానిస్తాన్ జట్టుకు ఎంతవరకు మేలు జరుగుతుందని పాక్ జర్నలిస్ట్ మళ్లీ అలాంటి ప్రశ్నే అడిగారు. అయితే మొహమ్మద్ నబీ మళ్లీ ఇది క్రికెట్‌కు సంబంధంలేని ప్రశ్న అని చెప్పాడు. అనంతరం విలేకరుల సమావేశం ముగించుకుని వెళ్లిపోయాడు. మీడియా సమావేశంలో చోటుచేసుకున్న ఈ తతంగంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఒక క్రికెటర్‌ ను రాజకీయాల గురించి ప్రశ్నించడాన్ని పలువురు తప్పుబట్టారు. మహ్మద్ నబీ సమాధానాన్ని ప్రశంసించారు. ఈ జర్నలిస్టు ఎవరైనా సరే జర్నలిజానికి, క్రికెట్‌ కు అవమానకరం. ఇలాంటి పరిస్థితిని సమయ స్పూర్తితో ఎదుర్కొన్నందుకు మొహమ్మద్ నబీకి కృతజ్ఞతలు అని పాకిస్తానీ జర్నలిస్టు షిరాజ్ హసన్ ట్వీట్ చేశారు.
Tags:    

Similar News