కొత్త లెక్క; జిహాదీల్లో వారే ఎక్కువంట

Update: 2016-03-16 03:59 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద సంస్థల రిక్రూట్ మెంట్ ఎలా జరగుతుంది? ఇందులో అభ్యర్థుల ఎంపిక ఎలా ఉంటుంది? ఎలాంటి వారిని ఉగ్రవాదులుగా రిక్రూట్ చేసుకుంటారు? లాంటి ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వటమే కాదు.. ఉగ్రవాదులుగా ఆకర్షితులవుతున్న దేశాలు.. అందుకు కారణాలు.. వారి నేపథ్యాలు.. వారి చదువు సంధ్యలు లాంటి ఎన్నో అంశాల్ని క్షుణ్ణంగా పరిశీలించి.. పరిశోధించేలా ఒక సర్వే నిర్వహించారు.

ఈ సర్వే ప్రత్యేకత ఏమిటంటే.. 800 మంది జిహాదీలపై పరిశోధన జరిపారు. దీన్ని నిర్వహించిన వారు కూడా సాదాసీదా వ్యక్తులు కాదు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ కు చెందిన ఇద్దరు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తాజాగా వారు ‘‘ఇంజినీర్స్ ఆఫ్ జిహాద్’’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇందులో జిహాదీలకు సంబంధించి ఆసక్తికర అంశాలున్నాయి.

ఉగ్రవాదుల రిక్రూట్ మెంట్లలో జీహాదీలుగా మారుతున్న వారిలో అత్యధికం ముస్లిం దేశాలకు చెందిన వారే కావటం గమనార్హం. పశ్చిమ.. ఆసియా దేశాల్లోని యువత ఆర్థికాభివృద్ధి ఫలాల్ని అందుకొని ఉద్యోగాల్లో స్థిరపడుతుంటే.. కొన్ని పేద ముస్లిం దేశాలకు చెందిన వారు జిహాదీ వైపునకు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి వారికి గాలం వేసేందుకు ఉగ్రవాద సంస్థలు రిక్రూట్ మెంట్లు భారీగా చేపట్టటంతో జిహాదీలు ముందుకు వస్తున్నారు. ఇక.. జిహాదీలుగా ఎంపిక అవుతున్న వారిలో అత్యధికులు ఇంజినీరింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వస్తున్న వారే ఎక్కువగా ఉండటం గమనార్హం.

ముస్లిం దేశాల నుంచి వచ్చే జిహాదీల్లో ఇంజినీర్ల సంఖ్య సాధారణం కంటే 17 రెట్లు అధికంగా ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. అంతేకాదు..ఉగ్రవాదులుగా ఎంపిక చేసే వారు బాంబులు ఎంత ధైర్యంగా వేస్తారనే అంశాన్ని అస్సలు ప్రాతిపదికగా తీసుకోరట. చెప్పిన విషయాన్ని ఎంత వేగంగా గ్రహిస్తారు.. వారి మాటల్ని ఆచరణలోకి పెడతారో అలాంటి వారిని ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతారని తాజా అధ్యయనం చెబుతోంది. ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కావటానికి.. పేద దేశాలకు చెందిన వారు.. తమ చదువుల్ని పూర్తి చేసుకోవటం.. సరైన ఉద్యోగాలు లేకపోవటం.. పేదరికం కారణంగా ఉగ్రవాదం వైపు మళ్లుతున్నట్లుగా తేల్చారు. ఉగ్రవాదంలోని అన్ని కోణాల్ని నిశితంగా స్పృశించిన ఈ పుస్తకం భద్రతా సంస్థలకు ఎంతోకొంత ఉపయోగపడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
Tags:    

Similar News