ఏపీ ఉన్నతాధికారులకు ఈసారి హైకోర్టు శిక్ష ఇలా!

Update: 2023-01-19 07:45 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ అంశాల్లో ఉన్నతాధికారులకు హైకోర్టు అక్షింతలు వేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో గౌతమ్‌ సవాంగ్‌ డీజీపీగా ఉన్నప్పుడు ఆయనను కోర్టుకు పిలిపించి.. బోనులో నుంచోబెట్టి పోలీసు చట్టంలోని పలు సెక్షన్లను హైకోర్టు చదివించింది. అలాగే సాక్షాత్తూ ప్రభుత్వంలో అత్యున్నత అధికారి అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సైతం కోర్టుకు పిలిపించింది. పలువురు అధికారులకు జైలుశిక్షలు, జరిమానాలు సైతం కూడా పడ్డాయి. మరికొందరిని స్వచ్ఛంధ సేవ చేయాలని శిక్షలు విధించింది.

తాజాగా మరో ఇద్దరు అధికారులకు సైతం నెల జైలుశిక్ష, జరిమానాను హైకోర్టు విధించింది. చివరి క్షణంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం నిలిపేయడంతో క్షమాపణలు చెప్పుకుని ఇద్దరు ఉన్నతాధికారులు బయటపడ్డారు.

తాజా ఘటన వివరాల్లోకెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని ఒక ఎయిడెడ్‌ కాలేజీలో పార్ట్‌ టైం లెక్చరర్‌గా సాంబశివరావు అనే వ్యక్తి పనిచేస్తున్నారు. తన సర్వీసును రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతూ ఆయన 2016లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయనకు అన్ని అర్హతలు ఉండటంతో ఆయన సర్వీసును క్రమబద్ధీకరించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు 2020 మార్చి 5న కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఆ తీర్పును సంబంధిత అధికారులు అమలు చేయకపోవడంతో సాంబశివరావు 2020 సెప్టెంబరులో హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. ఇంటర్మీడియట్‌ విద్య అప్పటి కమిషనర్‌ వి.రామకృష్ణ, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌లను తన పిటిషన్‌ లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై తాజాగా విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. ఉద్దేశపూర్వకంగా అధికారులు కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని తప్పుబట్టింది.

ఉద్దేశపూర్వకంగా తమ ఆదేశాలను అమలు చేయలేదంటూ ఇంటర్మీడియట్‌ విద్య అప్పటి కమిషనర్‌ వి.రామకృష్ణ, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ లకు నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది. సకాలంలో కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై వారు క్షమాపణలు చెప్పారు. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటామన్నారు.

దీంతో అధికారుల వయసు, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని జైలు శిక్ష విధింపును హైకోర్టు సవరించింది. హైకోర్టు పని గంటలు ముగిసే సాయంత్రం 4.15 గంటల వరకూ కోర్టులోనే నిల్చుని ఉండాలని శిక్ష విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ తీర్పు చెప్పారు. దీంతో ఉన్నతాధికారులు రామకృష్ణ, రాజశేఖర్‌ భోజన విరామ సమయం మినహా మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3 గంటల వరకూ చాలా సేపు కోర్టు హాలులోనే నిలబడ్డారు. మరోవైపు ఈ తీర్పుపై అత్యవసరంగా వారు ధర్మాసనం ముందు అప్పీలు చేశారు. దీంతో సింగిల్‌ జడ్జి తీర్పు అమలును ధర్మాసనం నిలిపివేసింది. దీంతో అధికారులు బయటపడ్డారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News