ఈసారైనా త‌మిళిసైతో కేసీఆర్ చేతులు క‌లుపుతారా?

Update: 2022-06-27 04:41 GMT
గ‌త కొంత‌కాలంగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య సంబంధాలు ఉప్పూ నిప్పుగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ విభేదాల నేపథ్యంలో తాజాగా జరిగే ఒక కార్య‌క్ర‌మం అంద‌రిలో ఆస‌క్తి రేపుతోంద‌ని అంటున్నారు. గవర్నర్‌ తమిళిసై ఈ నెల 28న రాజ్‌భవన్‌లో హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రాజ్యాంగం ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో గ‌వ‌ర్న‌రే ప్రమాణస్వీకారం చేయిస్తారు.

ఇది రాజ్‌భవన్‌లో జరగడం సంప్రదాయం. ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్‌ ప్రకారం.. హైకోర్టు న్యాయమూర్తులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితర ఉన్నతాధికారులు హాజరుకావాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ తో ఉన్న‌ విభేదాలతో సీఎం కేసీఆర్‌.. ఈ కార్యక్రమానికి హాజరవుతారా, లేదా అన్న‌దానిపై చ‌ర్చ జ‌రుగుతోంది.

జూన్ 28న ఉద‌యం టీ-హబ్‌ రెండో దశ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ వెళ్లనున్నారు. నిజానికి ఈ భవనాన్ని ఆయ‌న కుమారుడు, పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారని తొలుత వార్త‌లు వ‌చ్చాయి. కానీ దానిని సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని మంత్రి కేటీఆర్‌ ఆదివారం ట్విట్టర్‌ ద్వారా ప్రకటించ‌డం గ‌మ‌నార్హం. దీంతో గ‌వ‌ర్న‌ర్ ను క‌ల‌వ‌డం ఇష్టం లేకే వ్యూహాత్మకంగానే కార్యక్రమాన్ని మార్చినట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఈ మేరకు రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ గైర్హాజరయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంతకుముందు రెండుసార్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వచ్చినప్పుడు కూడా సీఎం కేసీఆర్ అప్ప‌టిక‌ప్పుడు వేరే కార్య‌క్ర‌మాలు పెట్టుకుని ఆ కార్యక్రమాలకు దూరంగా ఉన్నార‌ని గుర్తు చేస్తున్నారు.

పాడి కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీని చేసే వ్య‌వ‌హారంలో త‌మిళిసై, కేసీఆర్ మ‌ధ్య విభేదాలు పెడ‌చూపాయి. కౌశిక్ రెడ్డిని నామినేట్‌ చేయాలన్న ప్రతిపాదనలను గవర్నర్‌ తమిళిసై పెండింగ్‌లో పెట్టిననాటి నుంచి కేసీఆర్, త‌మిళిసై మ‌ధ్య‌ పొసగడం లేదని అంటున్నారు. దాదాపు పది నెలలుగా సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌ గడప తొక్కలేద‌ని గుర్తు చేస్తున్నారు. గవర్నర్‌ తమిళిసై తన అధికార పరిధిని అతిక్రమించి వ్యవహరిస్తున్నారని, రాజ్‌భవన్‌ను బీజేపీ కార్యకలాపాలకు అడ్డాగా మార్చారని మంత్రులు, టీఆర్‌ఎస్‌ నేతలు నేరుగానే ఆరోపణలు చేస్తున్నారు.

 ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దిన వేడుకలను కేవలం రాజ్‌భవన్‌కే పరిమితం చేయడం, సీఎం సహా మంత్రులు, సీఎస్‌, డీజీపీ కూడా హాజరుకాకపోవడంతో గవర్నర్‌, సీఎం మధ్య అంతరం మరింత పెరిగింద‌ని అంటున్నారది. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల సమయంలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండానే ముగించ‌డం గ‌మ‌నార్హం. వీటన్నిటి నేపథ్యంలో రాజ్‌భవన్‌లో కొత్త చీఫ్‌ జస్టిస్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం వెళతారా, లేదా అన్నదానిపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.
Tags:    

Similar News