ఎంఎస్ ధోనీ విషయంలో సీఎస్కే సీఈవో కీలక ప్రకటన!

ఇందులో భాగంగా ఈ సారి రిటెన్షన్ పరిమితిని ఆరుగురు ఆటగాళ్లకు పెంచింది.

Update: 2024-10-02 18:45 GMT

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఇటీవల రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ కోసం రిటెన్షన్ నియమాలని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ సారి రిటెన్షన్ పరిమితిని ఆరుగురు ఆటగాళ్లకు పెంచింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) ఆప్షన్ కూడా ఊంది.

ఈ సమయంలో అట్టిపెట్టుకున్న ఐదుగురు ఆటగాళ్ల కోసం రూ.75 కోట్లు ఖర్చు పెట్టాలి. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు తమ రిటైన్ జాబితాను ఈ నెల 31లోపు సమర్పించాలి. అనంతరం.. నవంబరులో ఐపీఎల్ 2025 సీజన్ కు సంబంధించిన మెగా వేలం జరగనుంది.

ఇదే సమయంలో... ఐపీఎల్ సీజన్ 2025లో అన్ క్యాప్డ్ ప్లేయర్ రూల్ ను మరలా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఏ భారత ఆటగాడైనా ఐదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా.. లేదా, బీసీసీఐ సెంట్రల్ కాంట్రక్ట్ కలిగి ఉండకపోయినా అతడిని అన్ క్యాప్డ్ ప్లేయర్ గా పరిగణిస్తారు.

ఈ సమయంలో.. ఎంఎస్ ధోనీ కోసమే ఈ రూల్ ను బీసీసీఐ తీసుకొచ్చిందనే ప్రచారం మొదలైంది. ఈ నిబంధన ప్రకారం ఎంఎస్ ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) రూ.4 కోట్లకు రిటైన్ చేసుకుంటుందని నెట్టింట బలంగా ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో స్పందించారు.

అవును... అన్ క్యాప్డ్ ప్లేయర్ నిబంధన కింద ధోనీని సీఎస్కే రిటైన్ చేసుకుంటుందని నెట్టింట జరుగుతున్న ప్రచారంపై ఆ ఫ్రాంఛైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించారు. ఇందులో భాగంగా.. ఇప్పటివరకూ అయితే ధోనీ విషయంలో సీఎస్కే ఎలాంటి చర్చలూ జరపలేదని తెలిపారు.

ఇదే సమయంలో ఈ నిబంధన గురించి తమకు స్పష్టత లేదని.. ఈ నిబంధనను ధోనీ కోసం కూడా తాము ఉపయోగించకపోవచ్చని.. దీని గురించి ఇంకా ధోనీతో చర్చించలేదని.. ప్రస్తుతం ధోనీ అమెరికాలో ఉన్నాడని.. త్వరలో తాను యూఎస్ వెళ్లి ధోనీతో చర్చించాక దీనిపై క్లారిటీ రానుందని అన్నారు.

ఈ సందర్భంగా ఐపీఎల్ 2025లో మహీ ఆడతాడనే తాను ఆశిస్తున్నట్లు కాశీ విశ్వనాథన్ తెలిపారు. కాకపోతే... ఫైనల్ డెసిషన్ మాత్రం ధోనీదే అని చెప్పారు.

కాగా... లీగ్ మొదటి నుంచీ అన్ క్యాప్డ్ ప్లేయర్ నిబంధన ఉన్నప్పటికీ.. ఏ ఫ్రాంఛైజీ కూడా దీన్ని ఉపయోగించుకోలేదు! దీంతో.. 2021లో ఈ నిబంధనను రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ ఈ రూల్ ని తీసుకొచ్చారు. ఈ నిబంధన భారత ఆటగాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. అయితే ఈ రూల్ తిరిగి తీసుకువచ్చింది.. ధోనీ కోసమే అనే ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News