సవక.. సవక.. ట్యాక్స్ ఫ్రీ టెస్లా..? వచ్చేస్తోంది భారత్ లోకి..
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు భారత ద్వారాలు తెరుచుకున్నాయి.
By: Tupaki Desk | 6 March 2025 3:15 PM ISTఅమెరికాలో భారతీయులు ఎగబడి మరీ కొనే కారు ఏది అంటే..? తమ జీవిత కాలంలో కొనాలని లక్ష్యంగా పెట్టుకునే ఆ కారు ఏదంటే..? టెస్లా.. మరి ఇలాంటి కారు భారత్ లోకి ఎందుకు రావడం లేదు..? ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ కార్లన్నీ అతిపెద్ద మార్కెట్ అయిన భారత్ లో దుమ్మురేపుతుంటే టెస్లా మాత్రం ఎందుకు రాలేకపోయింది? దీనికి సమాధానం.. భారత్ లో తయారీ నిబంధన.
భారత్ లో తయారీ యూనిట్ నెలకొల్పానేది.. అలాగైతేనే అనుమతి ఇస్తామని కేంద్ర ప్రభుత్వం టెస్లాకు విధించిన నిబంధన. అలా కాదు.. మేం ముందుగా బయట నుంచి తీసుకొచ్చి విక్రయిస్తాం.. తర్వాత తయారీ యూనిట్ పెడతాం అనేది టెస్లా ప్రతిపాదన. దీంతో ఇంతవరకు భారత మార్కెట్ లోకి రాలేకపోయింది.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు భారత ద్వారాలు తెరుచుకున్నాయి. పైగా మస్క్ ను ప్రభుత్వ సంస్కరణల విభాగం చీఫ్ గా నియమించారు ట్రంప్. ఇటీవల భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో మస్క్ తో భేటీ తర్వాత ఆ సంస్థ భారత మార్కెట్ లోకి వచ్చేందుకు రూట్ క్లియరైంది.
ఇప్పుడు టెస్లాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. అమెరికా నుంచి దిగుమతయ్యే కార్లపై సుంకాలను పూర్తిగా తొలగించేలా ఆ దేశంతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. భారత్ మాత్రం తక్షణమే సుంకాలను పూర్తిగా తొలగించడంపై ఆచితూచి స్పందిస్తోంది. ఇరు దేశాల అధికారుల మధ్య ఆటో టారిఫ్లు కీలక అంశంగా త్వరలో వాణిజ్య ఒప్పందంపై కీలక చర్చలు జరగనున్నాయి. దీంతో టెస్లా భారత మార్కెట్లోకి రావడం మరింత సులభమైంది.
కార్ల దిగుమతిపై ప్రస్తుతం భారత్ 110 శాతం సుంకాలు విధిస్తోంది. మరే దేశంలోనూ ఆ స్థాయిలో సుంకాలు లేవని మస్క్ విమర్శించారు కూడా. ట్రంప్ సైతం ఇదే అంశంపై భారత్ మీద విమర్శలు చేస్తున్నారు. ప్రతీకార సుంకాలు విధిస్తామని కూడా హెచరించారు. అమెరికా వర్గాలు భారత్ లో చాలా రంగాల్లో సుంకాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆటోమొబైల్ రంగంపై జీరో టారిఫ్ అమలవుతుందని భావిస్తున్నారు.
భారత్ లో ఏటా 40 లక్షల కార్లు విక్రయిస్తున్నారు. దేశీయ సంస్థలకు ప్రపంచంలోనే అత్యంత రక్షణ కల్పించే మార్కెట్ మనదే. కావడం గమనార్హం. ట్యాక్స్ విషయంలో రిలీఫ్ కల్పిస్తే టెస్లా అనుకున్నదాని కంటే తక్కువ ధరకే భారత రోడ్లపైకి రావొచ్చు.