Begin typing your search above and press return to search.

సినిమా పోయింది.. నువ్వు చావ‌వేంటి? అన్నారు!

భారీ ఆశ‌లు పెట్టుకున్న క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఫ్లాపైంది. అయితే ఈ ఫ్లాప్ ని త‌ట్టుకోలేక‌పోయిన స‌ద‌రు స్టార్ హీరో అభిమానులు హీరోయిన్‌పై నోటిదురుసు ప్ర‌ద‌ర్శించారు

By:  Tupaki Desk   |   5 Oct 2023 5:05 AM GMT
సినిమా పోయింది.. నువ్వు చావ‌వేంటి? అన్నారు!
X

భారీ ఆశ‌లు పెట్టుకున్న క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఫ్లాపైంది. అయితే ఈ ఫ్లాప్ ని త‌ట్టుకోలేక‌పోయిన స‌ద‌రు స్టార్ హీరో అభిమానులు హీరోయిన్‌పై నోటిదురుసు ప్ర‌ద‌ర్శించారు. మాట‌లతోనే తీవ్రంగా వేధించారు. సినిమా వైఫల్యానికి వారంతా తనను ఎలా నిందించారో ఇప్పుడు స‌ద‌రు క‌థానాయిక‌ గుర్తుచేసుకుంది. సినిమా ఫ్లాపైంది.. నువ్వు ఎందుకు చనిపోవు? అని ప్ర‌శ్నించార‌ని వెల్ల‌డించింది. ఇంత‌కీ ఎవ‌రా హీరోయిన్? అంటే.. బాలీవుడ్ బ్యూటీ డైసీ షా.

సల్మాన్ ఖాన్ 'జై హో'(2014)లో న‌టించిన డైసీ షా ఆ సినిమా పరాజయానికి తాను నింద‌లు భ‌రించాన‌ని గుర్తు చేసుకున్నారు. చాలా మంది ఆ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్‌ను 'ఏక్ థా టైగర్' ఆర్జ‌న‌తో పోల్చారని తెలిపింది. డైసీ షా 'జై హో' సినిమాతో న‌ట‌నారంగేట్రం చేసింది కానీ .. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ ఇతర చిత్రాల రేంజులో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీనిపై డైసీ మాట్లాడుతూ- జై హో విడుదలైన తర్వాత తాను చాలా ట్రోలింగ్‌కు గురయ్యానని చెప్పింది. సినిమా ఫేట్ అలా ఉంటే, తనను ద్వేషించార‌ని.. దానికి చాలా ప్రభావితమ‌య్యాన‌ని తెలిపింది.

''ఈ చిత్రం అద్భుతాలు చేస్తుందని ప్రజలు భావించారు. కానీ అది ప‌ని చేయలేదు. డైసీ వల్లనే సినిమాకు చెత్త‌ రివ్యూ వచ్చిందని ట్రోల్ చేశారు. సల్మాన్ సర్ అక్కడ కూర్చుని డైసీ, నువ్వు ఎందుకు ఎమోష‌న్ అవుతున్నావు? అని అడ‌గ‌డం నాకు గుర్తుంది. నేను 'నా తప్పు ఏమిటి? నేనేం చేసాను?' అని ఆవేద‌న చెందాను. సినిమాకు మూలస్తంభాల్లో నేను కూడా ఉన్నాను. కానీ అతడు (సల్మాన్) మొత్తం ఇంటి నిర్మాత క‌దా! అనుకున్నాను..'' అని తెలిపింది. తాను ఎదుర్కొన్న రకమైన ట్రోలింగ్‌ను గుర్తుచేసుకుంటూ.. నువ్వు ఎందుకు చావకూడదు? అంతకంటే గొప్ప ఇంకేం ఉంటుంది? అని త‌న‌ను కామెంట్ చేసార‌ని డైసీ తెలిపింది.

జై హోకు ముందు.. సల్మాన్ ఖాన్ 'ఏక్ థా టైగర్‌' లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందించారని అయితే జైహో కలెక్షన్లు YRF చిత్రం 'ఏక్ థా టైగ‌ర్‌' కంటే ఎక్కువగా రాలేద‌ని.. ఇది స‌ల్మాన్ అభిమానులను నిరాశపరిచిందని డైసీ షా చెప్పారు. రెండు చిత్రాలను వేర్వేరు బడ్జెట్‌లతో రూపొందించినా కానీ వాటిని పోల్చడం అర్ధంలేనిది! అని ట్రేడ్ విశ్లేషించిన‌ట్టు తెలిపారు.

జై హో సినిమా సామాన్యుల కోసం టికెట్ ధరలు పెంచలేదని డైసీ వెల్ల‌డించింది. టికెట్‌ ధరలు అస్సలు పెంచలేదు. ఇది మేకర్స్ ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయం. 'ప్రజల మనిషి' అని సినిమా ట్యాగ్‌లైన్‌ పెట్టడం గురించి, సామాన్యుడి జేబుకు చిల్లులు పెట్టాల్సిన వాడు... అలా చేయ‌లేద‌న్న‌ సల్మాన్‌ మాటల‌ను కూడా గుర్తు చేసుకున్నారు. జై హో రూ. 60 కోట్ల బడ్జెట్‌తో రూపొంది, రూ. 136 కోట్లు తెచ్చింది. నా దృష్టిలో సినిమా హిట్ అయింది. అయితే అందరూ దానిని 'ఏక్ థా టైగర్‌'తో పోల్చినందున స‌మ‌స్య ఎదురైంద‌ని డైసీ తెలిపింది. డైసీ ఆ త‌ర్వాత‌ హేట్ స్టోరీ 3 -రేస్ 3 వంటి చిత్రాలలో కనిపించింది. ఇటీవ‌ల కెరీర్ రేసులో వెన‌క‌బ‌డింది.