రొమాంటిక్ జంట మళ్లీ కలవనున్నారు..!
వీరిద్దరి జోడీలో మరిన్ని సినిమాలు రావాలని ప్రేక్షకులు ఆ సమయంలో కోరుకున్నారు. కానీ వీరిద్దరి కాంబోలో ఎక్కువ సినిమాలు రాలేదు.
By: Tupaki Desk | 2 April 2025 1:30 AM2013లో ఆషికి 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధా కపూర్లు సూపర్ హిట్ను సొంతం చేసుకున్నారు. ఆ సినిమాతో వీరిద్దరిని రొమాంటిక్ జంట అంటూ ప్రేక్షకులతో పాటు, సినీ వర్గాల వారు, మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటూ ఉండే వారు. వీరిద్దరి జోడీలో మరిన్ని సినిమాలు రావాలని ప్రేక్షకులు ఆ సమయంలో కోరుకున్నారు. కానీ వీరిద్దరి కాంబోలో ఎక్కువ సినిమాలు రాలేదు. సుదీర్ఘ కాలం తర్వాత వీరిద్దరి కాంబో సినిమాకు లైన్ క్లియర్ అయింది. బాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా శ్రద్దా కపూర్ హీరోయిన్గా మోహిత్ సూరి దర్శకత్వంలో సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బాలీవుడ్కి చెందిన ఒక ప్రముఖ మీడియా సంస్థ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ కథనం రాసుకొచ్చింది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొదలు అయింది. ఇద్దరూ కలిసి నటించేందుకు గాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే సినిమా మేకింగ్కు చాలా సమయం పడుతుందని సమాచారం. ఈమధ్య కాలంలో బాలీవుడ్లో వరుస ఫ్లాప్లు చూస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే రంజాన్ కానుకగా వచ్చిన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ సినిమాను విడుదల చేశారు. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన సికిందర్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఆదిత్యరాయ్ కపూర్ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో యూత్ ఆడియన్స్లో అంచనాలు ఉంటాయి.
అమర్ కౌశిక్ దర్శకత్వంలో వచ్చిన స్త్రీ 2 సినిమా విజయాన్ని ప్రస్తుతం శ్రద్దా కపూర్ ఆస్వాదిస్తోంది. స్త్రీ 2 విజయంతో శ్రద్దా కపూర్ స్థాయి అమాంతం పెరిగింది. ఆ సినిమాలో శ్రద్దా కపూర్ నటనకు మంచి మార్కులు పడ్డ విషయం తెల్సిందే. అందుకే శ్రద్దా తదుపరి సినిమా విషయమై అందరి దృష్టి ఉంది. ఎప్పుడెప్పుడు ఆమె కొత్త సినిమా వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. స్త్రీ 2 సక్సెస్ నేపథ్యంలో చిన్న బ్రేక్ తీసుకున్న శ్రద్దా కపూర్ త్వరలోనే కెమెరా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం బాలీవుడ్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో శ్రద్దా కపూర్ సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆదిత్య రాయ్ కపూర్ గత ఏడాది తన సినిమాను విడుదల చేయడంలో విఫలం అయ్యాడు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లను సైతం చేస్తున్న ఈయన ప్రస్తుతం 'మెట్రో ఇన్ డినో' సినిమాలో నటిస్తున్నాడు. అంతే కాకుండా 'రక్త బ్రహ్మాండం: ది బ్లడీ కింగ్డమ్' వెబ్ సిరీస్లోనూ నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్లో సమంత ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ రెండు ప్రాజెక్ట్ల తర్వాత మరోసారి శ్రద్దా కపూర్తో రొమాంటిక్ డ్రామాకు రెడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్లో ఆదిత్య రాయ్ కపూర్ నిలదొక్కుకోవడం కోసం మరోసారి భారీ బ్లాక్ బస్టర్ విజయం తప్పనిసరి. శ్రద్దా కపూర్తో ఆ హిట్ దక్కేనా అనేది చూడాలి.