Begin typing your search above and press return to search.

అఖిల్ కొత్త సినిమా ప్రకటన ఎప్పుడంటే?

హిట్టు కొట్టిన తర్వాతే ఫ్యాన్స్ ముందుకు రావాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు అక్కినేని అఖిల్.

By:  Tupaki Desk   |   10 Oct 2024 3:00 AM GMT
అఖిల్ కొత్త సినిమా ప్రకటన ఎప్పుడంటే?
X

హిట్టు కొట్టిన తర్వాతే ఫ్యాన్స్ ముందుకు రావాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు అక్కినేని అఖిల్. ఈ విషయాన్ని కింగ్ నాగార్జున స్వయంగా వెల్లడించారు. అయితే హిట్టు కొట్టాలంటే ముందుగా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి సెట్స్ మీదకు తీసుకెళ్ళాలి.. షూటింగ్ పూర్తి చేసి సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలి. కానీ ఇంతవరకూ అఖిల్ నుంచి కొత్త సినిమా ప్రకటన ఏదీ రాకపోవడమే అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తోంది. అయితే ఇప్పుడు వారిని ఉత్సాహ పరచడానికి అక్కినేని వారసుడు బ్యాక్ టూ బ్యాక్ రెండు అనౌన్స్ మెంట్స్ తో రాబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.

అఖిల్ లాస్ట్ ఇయర్ సమ్మర్ లో 'ఏజెంట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్.. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. అఖిల్ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులా మారింది. ఎన్నో హోప్స్ పెట్టుకున్న సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో, పూర్తిగా సైలెంట్ అయిపోయారు. బిగ్ స్క్రీన్ మీద కనిపించి ఏడాదిన్నర దాటిపోయినా సరే, ఇంతవరకూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు.

యూవీ క్రియేష‌న్స్ బ్యానర్ లో అఖిల్ ఓ భారీ సినిమా చేయ‌బోతున్నాడ‌ని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇదొక పీరియాడిక్ మూవీ అని, దాదాపు రూ.100 కోట్ల‌ బడ్జెట్ అని చెప్పుకున్నారు. దీనికి 'ధీర' అనే పేరు కూడా ప్ర‌చారంలోకి వచ్చింది. అనిల్‌ కుమార్‌ అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడని అన్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. అలానే 'వినరో భాగ్యము విష్ణు కథ' దర్శకుడు మురళీ కిశోర్‌ తో అఖిల్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ నడిచింది. కానీ ఇప్పటిదాకా దృవీకరించబడలేదు.

తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం యూవీ క్రియేషన్స్ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రారంభం అవుతుంద‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించిన క‌థ కూడా రెడీగా ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అయితే దీని కంటే ముందు అఖిల్ మరో మూవీ చేయ‌డానికి రెడీ అవుతున్నారని టాక్ నడుస్తోంది. ఓ కొత్త ద‌ర్శ‌కుడు చెప్పిన స్టోరీకి అఖిల్ ఓకే చెప్పాడని.. కథ నచ్చడంతో నాగార్జున తమ హోమ్ బ్యానర్ లోనే సినిమా తియ్యాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. ద‌స‌రాకు అధికారిక ప్రకటన ఉండొచ్చని, ఆ తర్వాతే యూవీ సినిమాని అనౌన్స్ చేస్తారని అంటున్నారు.

యూవీ క్రియేషన్స్ మూవీతో పాటు సొంత సినిమాని కూడా ఒకేసారి స‌మాంత‌రంగా తెర‌కెక్కించే అవ‌కాశాలు ఉన్నాయని టాక్. ఇదే నిజమైతే వచ్చే ఏడాది ఒక సినిమాని ఆడియన్స్ ముందుకు రావొచ్చు. ఏదేమైనా అఖిల్ ఈసారి కాస్త లేట్ అయినా పర్వాలేదు కానీ, కచ్ఛితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ రోజు కోసమే అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.