Begin typing your search above and press return to search.

CCL 2025: 8న‌ తెలుగు వారియర్స్ బిగ్ ఫైట్

ప‌రిమిత ఓవ‌ర్ క్రికెట్ టోర్నీల హ‌వా సాగుతోంది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌-ఐపిఎల్‌లో ఉత్కంఠ రేపే ఫైట్ ని వీక్షించేందుకు క్రికెట్ ప్రేమికులు ఎంతో ఉత్సాహం చూపుతుంటారు.

By:  Tupaki Desk   |   2 Feb 2025 4:30 PM GMT
CCL 2025: 8న‌ తెలుగు వారియర్స్ బిగ్ ఫైట్
X

ప‌రిమిత ఓవ‌ర్ క్రికెట్ టోర్నీల హ‌వా సాగుతోంది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌-ఐపిఎల్‌లో ఉత్కంఠ రేపే ఫైట్ ని వీక్షించేందుకు క్రికెట్ ప్రేమికులు ఎంతో ఉత్సాహం చూపుతుంటారు. ఐపీఎల్‌కి ధీటుగానే ఇటీవ‌ల సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) కూడా ఉత్కంఠభ‌రితంగా సాగుతోంది. ప్రొఫెష‌న‌ల్ క్రికెట‌ర్స్ ని త‌ల‌పించేలా స్టార్లు క్రికెట్ ఆడుతుంటే వీక్షించేందుకు రెండు క‌ళ్లు చాల‌డం లేదు.

ముఖ్యంగా అక్కినేని అఖిల్ సార‌థ్యంలోని తెలుగు వారియ‌ర్స్ టీమ్ మోస్ట్ స‌క్సెస్ ఫుల్ టీమ్ గా సీసీఎల్ టోర్నీలో పాపుల‌రైంది. దీంతో తెలుగు ప్ర‌జ‌లు `తెలుగు వారియ‌ర్స్` మ్యాచ్ లు వీక్షించేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. ఈ ఏడాది కూడా ఉత్కంఠ‌భ‌రిత‌మైన టోర్నీకి స‌మ‌య‌మాస‌న్న‌మైంది. ఇటీవ‌లే అఖిల్ అక్కినేని బాధ్యతలు అప్ప‌గించిన‌ట్టు టీమ్ అధికారికంగా ప్ర‌క‌టించింది. అఖిల్ టీమ్ కీర్తి కోసం .. విజయం కోసం సిద్ధ‌మ‌వుతోంద‌ని టీజ్ చేసారు. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఈ టోర్నీ సోనీ స్పోర్ట్స్ టెన్ 3 , డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రత్యక్షంగా వీక్షించే సౌల‌భ్యం ఉంది. ఇప్ప‌టికే టికెట్ బుకింగులు కూడా ఓపెన‌య్యాయి.

తాజాగా తెలుగు వారియ‌ర్స్ కెప్టెన్ అఖిల్, సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్, ఇత‌ర టీమ్ స‌భ్యుల సార‌థ్యంలో జెర్సీని లాంచ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో తెలుగు వారియర్స్ అత్యంత విజయవంతమైన జట్టు. వారియ‌ర్స్ ఆడిన 5 ఫైనల్స్‌లో 4 సార్లు టోర్నమెంట్‌ను గెలుచుకుంది. 2013లో మాత్ర‌మే కర్ణాటక బుల్డోజర్స్ (శాండ‌ల్వుడ్) విజయం సాధించింది. అయితే శాండల్‌వుడ్ టీమ్‌ ఇప్పటివరకు జరిగిన 10 ఫైనల్స్‌లో 7 ఫైనల్స్‌లో ఆడిన రికార్డును కలిగి ఉంది. గత సంవత్సరం ఫైన‌ల్ మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్ చేతిలో ఓడిపోవ‌డం పెద్ద నిరాశ‌.ఆ జట్టును కూడా తెలుగు వారియ‌ర్స్ గతంలో ఓడించారు. సీసీఎల్ మ్యాచ్ లు ఈనెల 8 నుంచి ప్రారంభం కానున్నాయి.

తెలుగు వారియ‌ర్స్‌తోనే ఠ‌ఫ్ ఫైట్: కిచ్చా సుదీప్

కర్ణాటక బుల్డోజర్స్- తెలుగు వారియర్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్ కఠినంగా ఉంటుందని కిచ్చా సుదీప్ అన్నారు. కానీ తన జట్టు మంచి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని అత‌డు తాజా ఇంట‌ర్వ్యూలో తెలిపారు. కిచ్చా సుదీప్ కెప్టెన్సీలోని శాండల్‌వుడ్ జట్టు కర్ణాటక బుల్డోజర్స్ ఫిబ్రవరి 8న బెంగళూరులోని సొంత మైదానంలో తెలుగు వారియర్స్‌తో జరిగే మ్యాచ్‌తో `సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025` టోర్నీని ఘ‌నంగా ప్రారంభిస్తుంది. హోమ్ టీమ్ ప్రైమ్-టైమ్ (సాయంత్రం) మ్యాచ్ స్లాట్ లో ఆడుతోంది. సాయంత్రం 6.30 గంటలకు చిన్నస్వామి స్టేడియంలో మైదానంలోకి దిగుతుంది. మొద‌టి మ్యాచ్‌లో హోమ్ టీమ్ పై నెగ్గాల‌ని తెలుగు వారియ‌ర్స్ వ్యూహాలు ర‌చిస్తోంది.