Begin typing your search above and press return to search.

మీ హీరోలాగా ఆడవాళ్ళని బూతులు తిట్టడమే వచ్చు: అనసూయ

మీడియా ఇంటరాక్షన్‌లో విజయ్ తో గొడవ సద్దుమణిగిందా అని అడిగినప్పుడు, ఆ విషయానికి తాను ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకోవడం లేదని చెప్పింది.

By:  Tupaki Desk   |   25 July 2024 7:39 AM GMT
మీ హీరోలాగా ఆడవాళ్ళని బూతులు తిట్టడమే వచ్చు: అనసూయ
X

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, యాంకర్ అనసూయ భరద్వాజ్ మధ్య విభేదాలు ఉన్నాయనే సంగతి తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'అర్జున్ రెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు మొదలైన రచ్చ, ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే దీనిపై ఇద్దరూ పలు సందర్భాల్లోస్పందించారు. తాజాగా 'సింబా' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మరోసారి VDతో విభేదాలపై అనసూయ నోరు విప్పింది. మీడియా ఇంటరాక్షన్‌లో విజయ్ తో గొడవ సద్దుమణిగిందా అని అడిగినప్పుడు, ఆ విషయానికి తాను ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకోవడం లేదని చెప్పింది.

అనసూయతో వివాదం గురించి 'ఖుషి' ఈవెంట్ లో విజయ్ దేవరకొండను అడగ్గా.. ''గొడవ పడేవాళ్ళను అడగాలి. ఎందుకు గొడవ పడుతున్నారో. ఏం నడుస్తుందో ఎందుకు నడుస్తుందో మనకు అసలు ఏం తెల్వదు'' అని బదులిచ్చారు. ఈ విషయం మీద తాజాగా అనసూయ స్పందిస్తూ.. ''ఎలాగైతే ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఒక మెసేజ్ ఇద్దామని అనుకున్నానో, అప్పుడు ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నాను. అలా మాట్లాడటం స్టేజ్ మ్యానర్స్ కాదు అనే టాపిక్ అంతే. ఒకచోట మనకు ఫోకస్ లైమ్ లైట్ లో ఉన్నప్పుడు మనం పద్ధతిగా ఉండాలి. అది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. కొన్ని మితిమీరినవి అందరికీ తెలుస్తాయి'' అని చెప్పింది. అంతేకాదు ఆ టైములో అది మీ అందరికీ ఎందుకు తప్పనిపించలేదని రివర్స్ లో మీడియాని ప్రశ్నించింది.

మీడియా మాట్లాడలేదు కాబట్టే తాను మాట్లాడాల్సి వచ్చిందని అనసూయ పేర్కొంది. అవతలి వ్యక్తిని అడగకపోవడం మీదే తప్పని, ఉల్టా చోర్ అంటూ ఒక హిందీ నానుడితో కౌంటర్ వేసింది. ''మీరు అదే విషయం గురించి అతన్ని (విజయ్ దేవరకొండ) అడిగినప్పుడు 'ఆమెను అడగండి' అని సమాధానం వచ్చింది. కానీ నేను అలా అగౌరవంగా మాట్లాడలేను. నేను ఎవరినీ ద్వేషించడం లేదు. అది నాకు కరెక్ట్ కాదనిపించింది. అంటే అక్కడితో అయిపోయింది. మనం ప్రతీ దాన్నుంచి ఏదొకటి నేర్చుకోవాలి. నేనొక రకంగా చెప్పాల్సింది ఇంకొక రకంగా చెప్పాను. నేనూ చాలా నేర్చుకున్నాను. ఒకప్పుడు నేను అన్నిటికీ గయ్యి గయ్యి మని రియాక్ట్ అవుతుండేదాన్ని. కానీ ఇప్పుడలా కాదు. నా అనుభవం నుండి ఇలాంటివి నేర్చుకున్నాను. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు'' అని అనసూయ తెలిపింది.



'సింబా' ఈవెంట్ లో అనసూయ కామెంట్స్ పై సోషల్ మీడియాలో నిన్నంతా చర్చ జరిగింది. కొందరు నెటిజన్లు మళ్లీ ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేసారు. ఈ నేపథ్యంలో అనసూయ ఎక్స్ లో ఘాటుగా స్పందించింది. “మరీ ఇంత చేతకానివాళ్లలా ఉంటే ఎలాగండీ.. నిజంగా మీకు కాలుతుందంటే నా మీద కాదు.. అస్తమానం నేను ఏం పని చేసినా ఆ టాపిక్ లాగే వాళ్ళని అనండి దమ్ముంటే.. కానీ మీరు అలా చేయరు కదా.. ఎందుకు మీరు అది చేతకాదు. మీ హీరోలాగా ఆడవాళ్ళని ఉద్దేశించి బూతులు తిట్టటం మాత్రమే వచ్చు కదా పాపం.. నేను ఇప్పటికీ మీరందరూ త్వరగా కోలుకోవాలని, నిజమైన ఉద్యోగం పొందాలని ప్రార్థిస్తున్నాను” అని అనసూయ సెటైరికల్ పోస్ట్ పెట్టారు. ఇక్కడ ఆమె ఎవరి పేరునీ మెన్షన్ చేయనప్పటికీ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ గురించే ఈ పోస్ట్ పెట్టినట్లు అర్థమవుతోంది. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.