Begin typing your search above and press return to search.

బ‌డా నిర్మాత కొడుకు సెల్ కొట్టేసి బెదిరింపులు!

By:  Tupaki Desk   |   10 May 2018 6:09 AM GMT
బ‌డా నిర్మాత కొడుకు సెల్ కొట్టేసి బెదిరింపులు!
X
ఇటీవ‌ల కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లోకి ఎక్కుతున్న టాలీవుడ్ బ‌డా నిర్మాత ద‌గ్గుబాటి సురేశ్ కుమారుడు అభిరామ్ మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు. ఈ మ‌ధ్య‌న సినీ న‌టి శ్రీ‌రెడ్డి ఇష్యూలో ఆయ‌న పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. వారిద్ద‌రికి సంబంధించిన ఫోటోల‌ను శ్రీ‌రెడ్డి విడుద‌ల చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఈ ఎపిసోడ్ లో వ‌ర్మ ఎంట్రీ.. శ్రీ‌రెడ్డి.. ద‌గ్గుబాటి ఫ్యామిలీకి మ‌ధ్య తానేదో సంధి చేసే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లుగా చెప్ప‌టం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా ద‌గ్గుబాటి అభిరామ్‌ కు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర అంశం బ‌య‌ట‌కు వ‌చ్చింది. కొన్ని నెల‌ల క్రితం రెస్టారెంట్‌ లో త‌న ఫోన్ ను పోగొట్టుకున్నారు అభిరామ్‌. ఆ ఫోన్ కొట్టేసిన నిందితులు ఐఫోన్ ను అన్ లాక్ చేసి.. అందులోని ఫోటోల్ని బ‌య‌ట‌పెడ‌తామంటూ బెదిరింపుల‌కు దిగారు.

తమ‌కు ల‌భించిన ఫోన్లోని ఫోటోలు బ‌య‌ట‌కు రాకుండా ఉండాలంటే రూ.1.5 కోట్లు చెల్లించాలంటూ ఈ మొయిల్ చేసి బెదిరింపుల‌కు దిగారు. దీంతో స్పందించిన సురేశ్ బాబు సైబ‌ర్ క్రైం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు గ‌డిచిన వారంలో న‌లుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.

తాజాగా వారిని అరెస్ట్ చేసిన వైనాన్ని బ‌య‌ట‌పెట్టారు. సెల్ ఫోన్ కొట్టేసి.. అందులోని డేటాను ఉప‌యోగించి బ్లాక్ మొయిల్ చేస్తున్న వైనంపై న‌గ‌ర క‌మిష‌న‌ర్ కు సురేశ్ బాబు ఫిర్యాదు చేయ‌టం.. దీనిపై విచారించిన పోలీసులు గోదావ‌రి జిల్లాల‌కు చెందిన న‌లుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక‌రు కూక‌ట్ ప‌ల్లిలో కూర‌గాయ‌లు అమ్మే వ్యాపారిగా.. ప్రైవేటు ఉద్యోగులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులు చోరీ చేసిన ఫోన్ లోని ఏ ఫోటోలు.. వీడియోల పేర్లు చెప్పి బ్లాక్ మొయిల్ చేశార‌న్న‌ది పోలీసులు బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.