Begin typing your search above and press return to search.

ఆదిపురుష్‌ : ట్రైలర్‌ కి ట్రోల్స్ రాకుండా ముందు జాగ్రత్త!

By:  Tupaki Desk   |   5 May 2023 12:10 PM
ఆదిపురుష్‌ : ట్రైలర్‌ కి ట్రోల్స్ రాకుండా ముందు జాగ్రత్త!
X
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ నటించిన మొదటి బాలీవుడ్ చిత్రం ఆదిపురుష్‌ విడుదలకు సిద్ధం అయ్యింది. జూన్‌ 16వ తారీకున విడుదల కాబోతున్న ఆదిపురుష్ ట్రైలర్ విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది. ట్రైలర్‌ విడుదల విషయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఆదిపురుష్ ట్రైలర్ కి ట్రోల్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఆదిపురుష్ టీజర్ కి విమర్శలు వచ్చిన విషయం తెల్సిందే. పిల్లల సినిమా అంటూ ట్రోల్స్ వచ్చాయి. అంతే కాకుండా ఇలాంటి వీఎఫ్‌ఎక్స్‌ ను పదేళ్ల క్రితమే చూశాం అన్నట్లుగా కూడా ట్రోల్స్ వచ్చాయి. కొందరు కావాలని పనిగట్టుకుని ట్రోల్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం టైమ్‌ పాస్ కి అన్నట్లుగా ట్రోల్స్ చేశారు.

ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ కి వచ్చిన ట్రోల్స్‌ కారణంగా ఇప్పటికే సినిమాకు చాలా డ్యామేజీ జరిగింది. మళ్లీ ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహించి ఆ డ్యామేజీని కంట్రోల్‌ చేయడం జరిగింది. అంతే కాకుండా ట్రైలర్‌ తో ఆ ట్రోల్స్ అన్నింటికి కూడా సమాధానం చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ట్రైలర్‌ ను నేరుగా యూట్యూబ్‌ లో రిలీజ్ చేస్తే కచ్చితంగా ఏదో రకంగా ట్రోల్స్ చేసి నెగటివ్‌ టాక్ ను ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక ముందు థియేటర్ ల ద్వారా స్క్రీనింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. 3డి వెర్షన్ ను స్క్రీనింగ్ చేయడం ద్వారా ఆదిపురుష్ పై అంచనాలు పెంచబోతున్నారు.

దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా ఈ సినిమా యొక్క 3డి వర్షన్‌ ట్రైలర్‌ ని స్క్రీనింగ్‌ చేయాలని భావిస్తున్నారట. థియేటర్ స్క్రీనింగ్ అయిన కొన్ని గంటల తర్వాత ఆన్‌ లైన్ ద్వారా వస్తే కచ్చితంగా ట్రోల్స్ అనేవి తగ్గుతాయి అనేది యూనిట్‌ సభ్యుల నమ్మకంగా తెలుస్తోంది.

ట్రైలర్‌ కి ట్రోల్స్ వస్తే ఓపెనింగ్‌ కలెక్షన్స్ పై ప్రభావం ఉంటుంది. అందుకే సినిమా యొక్క ట్రైలర్‌ విషయంలో ముందు జాగ్రత్తగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ట్రైలర్ విడుదల తర్వాత ఆదిపురుష్ స్థాయి ఏంటి అనేది ఈ ప్రపంచానికి తెలుస్తుంది అంటూ యూనిట్‌ సభ్యులు చాలా ధీమాగా చెబుతున్నారు. వెయ్యి కోట్ల టార్గెట్‌ తో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.