Begin typing your search above and press return to search.

'దూకుడు' తరువాత ఆ రేంజ్ కితకితలు ఖాయం!

By:  Tupaki Desk   |   3 May 2022 11:30 PM GMT
దూకుడు తరువాత ఆ రేంజ్ కితకితలు ఖాయం!
X
తెలుగు తెర ఒకప్పుడు సీనియర్ కమెడియన్స్ తో కళకళలాడిపోతూ ఉండేది. చూస్తుండగానే ఏవీఎస్ .. ఎమ్మెస్ .. ధర్మవరపు .. కొండవలస .. వేణుమాధవ్ అంతా కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే సునీల్ హీరో వేషాలవైపు వెళ్లడంతో, అందరికీ వెన్నెల కిశోర్ దిక్కయ్యాడు. వెన్నెల కిశోర్ తనదైన స్టైల్ తో ప్రేక్షకులను అలరిస్తూ వెళ్లడం మొదలుపెట్టాడు. ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి. దాంతో వెన్నెల కిశోర్ ఫుల్ బిజీ అయ్యాడు.

ఇక అప్పటివరకూ వరుస సినిమాలు చేస్తూ వచ్చిన బ్రహ్మానందం కూడా, తన అనారోగ్య కారణాల వలన సినిమాల సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చారు. దాంతో వెన్నెల కిశోర్ మరింత బిజీ అయ్యాడు. అయితే కొంతకాలంగా ఆయనకి సరైన పాత్రలు పడలేదు.

ఆయన పోషించిన పాత్రలో పెద్దగా పేలలేదు. ఆయన బాడీ లాంగ్వేజ్ కి .. డైలాగ్ డెలివరీకి తగిన పాత్రలను రైటర్స్ క్రియేట్ చేయలేకపోయారు. క్రితం ఏడాదిలో ఆయన చేసిన సినిమాల్లో ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోదగినది లేదు.

ఈ నేపథ్యంలోనే ఆయన రీసెంట్ గా 'ఆచార్య' సినిమాలో హీరోకి ఆశ్రయం కల్పించే పాత్రలో కనిపించాడు. ఇక వెన్నెల కిశోర్ గట్టిగానే సందడి చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఆ తరువాత ఆయన కామెడీనే కాదు .. ఆయనే కనిపించకుండా పోయాడు.

ఆ పాత్రకి వెన్నెల కిశోర్ ను ఎందుకు తీసుకున్నారో .. ఆ తరువాత ఆ పాత్రను ఎందుకు డమ్మీని చేశారనేది తెలియదు. చిరంజీవి సినిమా అనో .. కొరటాల సినిమా అనో మొహమాటానికి వెన్నెల కిశోర్ ఆ పాతకి అంగీకరించి ఉంటాడనే విషయం అర్థమైపోతూనే ఉంటుంది.

ఇక ఇప్పుడు 'సర్కారువారి పాట' సినిమా ట్రైలర్ చూసిన తరువాత, ఈ సినిమాలో వెన్నెల కిశోర్ పాత్ర నవ్వుల పువ్వులు పూయించడం ఖాయమని అనిపిస్తోంది. ఇద్దరి మధ్య కామెడీ ట్రాక్ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుందనే అనిపిస్తోంది. గతంలో 'దూకుడు' సినిమా విజయంలో మహేశ్ - వెన్నెల కిశోర్ కాంబినేషన్లోని కామెడీ ముఖ్యమైన పాత్రను పోషించింది. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్లో వర్కౌట్ అయింది. ఇక పరశురామ్ కూడా 'గీత గోవిందం' తరువాత ఆ స్థాయి పాత్రనే వెన్నెల కిశోర్ కి ఇచ్చి ఉంటాడని అనుకోవాలి.