Begin typing your search above and press return to search.

టాలీవుడ్ సెలబ్రిటీలకు కొత్త దారి చూపించిన బన్నీ

By:  Tupaki Desk   |   9 April 2021 9:48 AM GMT
టాలీవుడ్ సెలబ్రిటీలకు కొత్త దారి చూపించిన బన్నీ
X
రోటీన్ మార్గంలో నడిస్తే ఏం బాగుంటుంది. లేటైనా ఫర్లేదు.. లేటెస్ట్ గా ఉండాలన్న రూల్ ను పక్కాగా పాటిస్తుంటారు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. ఆయన చేసే ప్రతి సినిమాకు.. అంతకు ముందు తాను చేయని ఏదో ఒక కొత్త స్టైల్ ను చూపించాలని తెగ తాపత్రయపడుతుంటారు. సినిమా ప్రమోషన్ విషయంలోనూ అదే తీరును ఆయన ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఆయన టీం తీసుకున్న నిర్ణయం.. రానున్న రోజుల్లో టాలీవుడ్ సెలబ్రిటీలకు సరికొత్త దారిని చూపించిందని చెప్పాలి.

అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప మూవీ టీం.. సరికొత్త ప్రమోషన్ ను పరిచయం చేశారు. హైదరాబాద్ మహానగరంలో సరికొత్త అట్రాక్షన్ గా మారిన మాదాపూర్ తీగల వంతెనను వేదికగా చేసుకొని ప్రచారాన్ని నిర్వహించారు. పుట్టిన రోజును పురస్కరించుకొని.. అల్లు అర్జున్ ఫోటోను.. ఆయన పేరును లేజర్ షోలో నిర్వహించారు.

వాహనదారులతో పాటు.. కేబుల్ వంతె మీద ఆహ్లాద వాతావరణంలో ఎంజాయ్ చేస్తున్న వారి మనసుల్ని దోచుకునే లేజర్ షో ప్రత్యేక ఆకర్షణ అన్న విషయం తెలిసిందే. కేబుల్ వంతెన మీద పుష్ప సినిమాకు సంబంధించిన ఫోటోల్ని ప్రదర్శించారు. అంతేకాదు.. లేజర్ షోలో ఆయన పేరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

రాత్రి ఏడు గంటల నుంచి ఎన్నిమిదన్నర గంటల వరకు (అంటే.. గంటన్నర పాటు) ఈ లేజర్ షోలో బన్నీ పేరును.. ఫోటోల్ని ప్రదర్శించారు. ఇది పలువురిని ఆకర్షించింది. ఇందుకోసం రూ.30వేల రుసుమును పుష్ప యూనిట్ జీహెచ్ఎంసీకి చెల్లించారు. ముందస్తు జాగ్రత్తగా రూ.70వేలను డిపాజిట్ గా కట్టారు. ఈ కొత్త ప్రచారం రానున్న రోజుల్లో మరింత మంది ఫాలో కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.