Begin typing your search above and press return to search.

శంకర పల్లి ఎమ్మార్వో ఆఫీసుకు బన్నీ ఎందుకు వెళ్లారు?

By:  Tupaki Desk   |   8 Oct 2021 9:30 AM GMT
శంకర పల్లి ఎమ్మార్వో ఆఫీసుకు బన్నీ ఎందుకు వెళ్లారు?
X
ప్రభుత్వ కార్యాలయాలకు స్టార్ హీరోలు వెళ్లటం చాలా తక్కువ. ఏ పని అయినా తమ సహాయకులు ఇట్టే పూర్తి చేస్తారు. దాదాపుగా కాలు కదపకుండానే పని పూర్తి చేసుకునే పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కొన్నిసార్లు తప్పనిసరిగా ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లక తప్పని పరిస్థితి ఉంటుంది. చేతిలో ఎంత పవర్ ఉన్నా.. కొత్త వాహనం కొని.. దాన్ని కొనుగోలు చేసిన వారు తప్పనిసరిగా ఆర్టీవో ఆఫీసుకు వెళ్లి.. ఫోటో దిగి.. డిజిటల్ సైన్ పెట్టి రావాల్సిందే. అంతకు మించి మరో మార్గం ఉండదు. అదే రీతిలో కొన్ని పనులకు తప్పనిసరిగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిందే.

తాజాగా సినీ హీరో.. యూత్ లో మాంచి క్రేజ్ ఉన్న బన్నీ అలియాస్ అల్లు అర్జున్ తాజాగా శంకర్ పల్లి ఎమ్మార్వో ఆఫీసుకు రావటంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లని బన్నీకి అంత పని ఏమొచ్చిందన్నది చూస్తే.. శంకర్ పల్లి మండలంలోని జన్వాడ గ్రామంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమిని అల్లు అర్జున్ కొనుగోలు చేశారు.

ఈ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనుల కోసం ఈ రోజు (శుక్రవారం) ఉదయం ఆయన వచ్చారు. ఎమ్మార్వో ఆఫీసుకు అల్లు అర్జున్ వచ్చారన్న విషయం తెలిసినంతనే పెద్ద ఎత్తున ఆఫీసు వద్దకు చేరుకున్నారు. ఆయనతో ఫోటోలు దిగేందుకు ఆసక్తిని ప్రదర్శించారు. రిజిస్ట్రేషన్ పని పూర్తి అయిన వెంటనే ఆయన శంకర్ పల్లి నుంచి బయలుదేరి హౌదరాబాద్ కు చేరుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. గతంలోనూ శంకర్ పల్లి ఎమ్మార్వో ఆఫీసుకు జూనియర్ ఎన్టీఆర్ రావటం తెలిసిందే. ఆయన కూడా అక్కడ ల్యాండ్ కొన్నారు. మొత్తానికి సిటీ శివారులో శంకర్ పల్లి ఇప్పుడు స్టార్లకు.. సెలబ్రిటీలకు హబ్ గా మారిందని చెప్పక తప్పదు.