Begin typing your search above and press return to search.

కంటికి కనిపించని సినీ ఇండస్ట్రీ వేరే ఉంది - అనసూయ

By:  Tupaki Desk   |   3 Jan 2021 8:00 PM IST
కంటికి కనిపించని సినీ ఇండస్ట్రీ వేరే ఉంది - అనసూయ
X
‘అనసూయ..’ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన మెస్మరైజింగ్ యాక్టింగ్ తో వెండితెర ఆడియన్స్ ను కూడా అలరిస్తోంది ఈ అమ్మడు. సామాజిక అంశాలతోపాటు.. వ్యక్తిగత అంశాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అనసూయ. ఏ విషయంలోనైనా తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తుంటారు. లేటెస్ట్ గా మీడియాతో మాట్లాడిన ఈ హాట్ యాంకర్.. గత ఏడాది ఎదుర్కొన్న అనుభవాలు.. నేర్చుకున్న పాఠాలను వివరించారు.

గడిచిపోయిన 2020 ఏడాదిని త‌ల‌చుకుంటే కొన్నిసార్లు భ‌య‌మేస్తుంద‌ని చెప్పారు అనూ. అదే సమయంలో మ‌రికొన్నిసార్లు చాలా నేర్చుకున్నామ‌నే భావ‌న క‌లుగుతుంద‌ని అన్నారు. కోవిడ్ వ‌ల్ల జనం స్వేచ్ఛగా బ‌య‌ట అడుగు పెట్టే అవకాశం లేక‌పోయింద‌న్న ఆమె.. తాను కూడా చాలా కోల్పోయినట్టు చెప్పారు. ప్రధానంగా ఈ కరోనా సీజన్ లో పెద్ద సినిమా అవకాశాలను జారవిడుచుకున్నట్టు వెల్లడించారు.

ఇక, చిత్ర‌ప‌రిశ్ర‌మ గురించి తనదైన పరిశీలనను వెల్లడించారు అనసూయ. బ‌య‌టికి క‌నిపించ‌ని ఫేవ‌రెటిజం ఇండస్ట్రీలో చాలా ఉంద‌ని చెప్పారు. షూటింగ్ త‌ర్వాతే అస‌లు క‌థ న‌డుస్తుంద‌ని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. సినిమా విడుద‌లై, అందులో మ‌నం క‌నిపించేంత వ‌ర‌కూ ఎంతో ఆందోళ‌న ఉంటుంద‌న్నారు అనసూయ.

‘మనం ఒక సినిమాకు కమిట్ అవుతాం.. మన పాత్రలు సిద్ధమవుతాయి.. ఇక షూటింగ్ కు వెళ్లడమే తరువాయి అనుకునేలోగా ఆ ప్రాజెక్టు మనచేజారిపోతుంది. ఇలా చాలా సంద‌ర్భాల్లో జరుగుతుంద’ని ఆవేదన వ్యక్తంచేశారు అనసూయ. ఇందుకు త‌న అనుభ‌వాన్నే ఉదాహ‌ర‌ణ‌గా తెలిపారు. కోవిడ్ స‌మ‌యంలో తాను నాలుగు పెద్ద సినిమాల్లో న‌టించే అవ‌కాశాన్ని కోల్పోయిన‌ట్టు అన‌సూయ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అయితే.. ఆ పాత్రలు వేరే వాళ్లు చేశారని చెప్పిన అనసూయ.. వాళ్లు త‌న‌కంటే కన్నా గొప్పగా నటించేవారు కానే కాద‌ని చెప్పారు. అయినప్పటికీ వాళ్ల‌కే అవకాశం దక్కింద‌ని వాపోయారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు గ‌తంలోనైతే చాలా బాధపడేదాన్న‌ని.. ఆ తర్వాత వాస్తవాలను గ్రహిస్తున్నానని, ఇప్పుడు పెద్దగా బాధపడటం లేదని అన‌సూయ తెలిపారు.

ఇక, సామాజిక మాధ్యమాల్లో యాక్టీవ్‌గా ఉండ‌డం గురించి కూడా ఆమె వివ‌రించారు. సోష‌ల్ మీడియాలో త‌న‌పై ర‌క‌ర‌కాల కామెంట్స్ వ‌స్తూ ఉంటాయ‌న్నారు. అయితే.. ఇలాంటి కామెంట్లు విని గతంలో చాలా సీరియ‌స్ అయ్యేదాన్న‌ని చెప్పారు. మ‌న‌సులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేదానని, అందువ‌ల్లే త‌న‌ను వివాదాలు చుట్టుముట్టేవ‌ని చెప్పారు.

అయితే.. ఇలా ఎందుకు జరుగుతోందని ఆలోచించిన తర్వాత ఇటీవ‌ల ఈ విష‌య‌మై క్లారిటీ వ‌చ్చింద‌న్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో కామెంట్స్‌ పై స్పందించ‌డం పూర్తిగా మానేసిన‌ట్టు అన‌సూయ తెలిపారు. ‘‘ఏ విషయంపైనైనా కావొచ్చు.. ప్ర‌తి వ్య‌క్తికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. అలాంటి అంశాలపై స్పందిస్తూ స‌మ‌యాన్ని వృథా చేసుకోవ‌డ‌ం సరికాదనే నిర్ణయానికి వచ్చాను. ఇప్పుడు అలాంటి విషయాలపై స్పందించ‌డం మానేశాను.’’ అని అన‌సూయ చెప్పుకొచ్చారు.