Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసులో మళ్ళీ తెరపైకి అందాల యాంకర్..!

By:  Tupaki Desk   |   9 Sep 2021 6:31 AM GMT
డ్రగ్స్ కేసులో మళ్ళీ తెరపైకి అందాల యాంకర్..!
X
కన్నడ చిత్రసీమలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ రాకెట్ లో బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో యాంకర్ అనుశ్రీ ని కూడా సీసీబీ విచారించింది. ఆ సమయంలో అనుశ్రీ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఓ వీడియో షేర్ చేస్తూ తనకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని.. సీసీబీ విచారణ చేసినంత మాత్రాన తాను నేరస్తురాలిని కాదని.. సీసీబీకి తెలిసిన మేర వివరాలు అందించానని.. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు డ్రగ్స్ కేసులో అనుశ్రీ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది.

సీసీబీ పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్ లో యాంకర్ అనుశ్రీ పేరును కూడా పేర్కొన్నారు. అనుశ్రీ డ్రగ్స్ విక్రయించడంతో పాటు రూమ్ కి తీసుకొచ్చేదని ఆమె స్నేహితుడు కిషోర్ అమన్ శెట్టి చెప్పినట్లు అధికారులు ఇందులో ప్రస్తావించారు. అనుశ్రీ బెంగళూరులో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో డ్రగ్స్ తీసుకునేదని.. దాని వల్ల ఖుషీగా డ్యాన్స్ చేయవచ్చని తోటివారితో చెప్పేదని.. అనుశ్రీ రియాలిటీ షో టైటిల్ గెలిచిన సమయంలో కూడా డ్రగ్స్ పార్టీకి హాజరయ్యారని కిషోర్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.

అయితే కిషోర్ అమన్ శెట్టి మంగళూరులో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అనుశ్రీ డ్రగ్స్ తీసుకుంటుందని తాను పోలీసుల విచారణలో చెప్పలేదని ప్రకటించాడు. అనుశ్రీతో పెద్దగా తనకు పరిచయం లేదని.. 2009లో ఓ కన్నడ డ్యాన్స్ షోలో కలిశానని.. ఆ తరువాత ఆమెను ఎప్పుడూ ఎక్కడా తాను కలవలేదని తెలిపాడు. చార్జీషీట్ లో పేర్కొన్న ఆరోపణలను ఖండించిన కిషోర్.. అనుశ్రీపై ఎలాంటి విరుద్ధ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు.

డ్రగ్స్ కేసు చార్జిషీట్ లో తన పేరు రావడంపై యాంకర్ అనుశ్రీ సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా స్పందించారు. 'బెంగళూరుకు వచ్చిన ఈ 14 ఏళ్లలో దాదాపు పన్నెండేళ్ళు హాస్టల్లో ఉన్నాను. ఆ సమయంలో బస్సులోనే తిరిగాను. ఆ తర్వాత టీవీ రంగంలో ఆఫర్లు వచ్చాయి. నేను మంచిగా ఉన్నాను కాబట్టే ఈ స్థాయికి ఎదిగాను. డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కోవడం నన్ను బాధకు గురి చేసింది. నేను ఏ తప్పూ చేయలేదు' అని అనుశ్రీ పేర్కొన్నారు.