Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ తో బాలయ్య పర్సనల్ మీట్ ?

By:  Tupaki Desk   |   26 Feb 2019 5:31 AM GMT
ఫ్యాన్స్ తో బాలయ్య పర్సనల్ మీట్ ?
X
జరగకూడనిదే జరిగిపోయింది. ఎన్నో ఆశలతో భారీ బడ్జెట్ తో తన పేరు మీద బ్యానర్ ను స్థాపించి భార్యను నిర్మాతగా టైటిల్ కార్డు వేసి నందమూరి బాలకృష్ణ తీసిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలూ జనం నిర్మొహమాటంగా తిరస్కరించారు. ఫ్లాప్ అయినా పర్వాలేదు కాని కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ గా ఇది నిలవడం బాలయ్యకు ఏ మాత్రం డైజెస్ట్ కావడం లేదు. నాన్నకు ఘన నివాళిగా చిరకాలం నిలిచిపోయే సినిమా తీస్తున్నాను అనుకుంటే వీలైనంత త్వరగా దీన్ని మర్చిపోయేలా ఫలితం రావడం ఫ్యాన్స్ సైతం ఊహించనిది.

మరీ తీసికట్టుగా వస్తున్న వసూళ్లు చూస్తుంటే అసలు నందమూరి టిడిపి అభిమానులైనా చూసారా లేదా అనే అనుమానం కలుగుతోంది. ఇదిలా ఉండగా దీని కోసం బాలయ్య సత్యశోధనలోకి దిగబోతున్నట్టు సమాచారం. అంటే పోస్ట్ మార్టం లాగన్న మాట. ఇందు కోసం త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తన అభిమాన సంఘాల నాయకులు కీలక సభ్యులతో సమావేశం నిర్వహించబోతున్నట్టు తెలిసింది

అసలు ఇంత దారుణంగా సినిమా ఎందుకు పోయింది కనీసం మొదటి రోజు హౌస్ ఫుల్ కాలేని రీతిలో మహానాయకుడు మీద ఎందుకు అభిమానులు సైతం అయిష్టం పెంచుకున్నారు లాంటి కారణాలు ఆయనే స్వయంగా తెలుసుకొబోతున్నట్టు టాక్. బయోపిక్ ఆలోచన మంచిదేనా లేక తానేమైనా తొందరపడ్డానా అనే వివరం కూడా కనుక్కోబోతున్నారట. తప్పు ఎక్కడ జరిగిందో నేరుగా వాళ్ళ ద్వారా రాబట్టాలానే ఆలోచనలో బాలయ్య ఉన్నట్టు తెలిసింది.

ఇదంతా బాగానే ఉంది కాని ఇదేదో ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాణానికి ముందు చేసుంటే కనీసం వాళ్ళ అంచనాలు ఎలా ఉన్నాయో తెలిసే అవకాశం దక్కేది కదా. వాటిని బట్టి స్క్రిప్ట్ లో మార్పులు చేసుకునే అవకాశం దక్కేది. అయినా ఇప్పుడు వీటి వల్ల ఎంత ఉపయోగం ఉందనేది పక్కన పెడితే మహానాయకుడు బాక్స్ ఆఫీస్ వద్ద కోలుకోవడం మాత్రం అసాధ్యం అని తేలిపోయింది