Begin typing your search above and press return to search.

23 ఏళ్ల తర్వాత అలాంటి పాత్రలో బాలయ్య..?

By:  Tupaki Desk   |   29 April 2022 1:30 AM GMT
23 ఏళ్ల తర్వాత అలాంటి పాత్రలో బాలయ్య..?
X
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ.. ఎలాంటి పాత్ర అయినా పోషించడానికి రెడీగా ఉంటారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎన్నో పౌరాణిక చారిత్రక సాంఘిక జానపద చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు బాలయ్య. అయితే కెరీర్ ప్రారంభం నుంచీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించడానికి నటసింహం పెద్దగా ఆసక్తి కనబరచలేదనే చెప్పాలి.

బాలకృష్ణ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన ఏకైక సినిమా ''సుల్తాన్". 1999 లో వచ్చిన ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. అందులో ఒకటి విలన్ రోల్. క్లైమాక్స్ లో మంచిగా మారి చనిపోయే పాత్ర అది. ఈ సినిమా సీనియర్ హీరోకి నిరాశనే మిగిల్చింది. దీంతో ఆ తర్వాత బాలయ్య అలాంటి పాత్రల జోలికి వెళ్ళలేదు. అయితే ఇప్పుడు మరోసారి నెగెటివ్ క్యారక్టర్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది.

బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో #NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ హై ఇంటెన్స్ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అధికారికంగా చెప్పకపోయినా నటసింహం రెండు పాత్రల్లో కనిపిస్తారని కన్ఫర్మ్ అయింది.

అయితే అందులో ఒక పాత్ర నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందని.. అది చాలా పవర్ ఫుల్ రోల్ అని రూమర్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఒక క్యారక్టర్ కు సంబంధించిన బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మైనింగ్ ప్రాంతంలో పంచె కట్టులో బ్లాక్ షర్ట్ ధరించి బాలయ్య సరికొత్తగా కనిపించారు. ఇది నెగెటివ్ రోల్ అయ్యుండొచ్చని అంటున్నారు.

ఇందులో తమిళ విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఆ పాత్రకు చెల్లిగా కనిపించనుంది. ప్రస్తుతం హైదరాబాద్ సారధి స్టూడియోస్ లో షూటింగ్ జరుగుతుండగా.. వరలక్ష్మి ఎంగేజ్మెంట్ సీన్ ను షూట్ చేశారని తెలుస్తోంది. బాలయ్య నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడమనేది ఆసక్తికరమైన విషయం. ఒకవేళ ఇదే నిజమే అయితే.. దాదాపు 23 ఏళ్ల తర్వాత మళ్ళీ అలాంటి రోల్ లో చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది.

NBK107 మూవీలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్‌ గా నటిస్తోంది. ప్రముఖ కన్నడ స్టార్ దునియా విజయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పోషిస్తున్న ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్ర ఫస్ట్ లుక్ ని ఇటీవలే రిలీజ్ చేశారు. మలయాళ నటుడు లాల్ - నవీన్ చంద్ర - థర్టీ ఇయర్స్ పృథ్వీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని - వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తుండగా.. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించారు.

సాయి మాధవ్‌ బుర్రా సినిమాలో డైలాగ్స్ రాస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ద్వయం ఫైట్స్ కంపోజ్ చేస్తున్న ఈ చిత్రానికి చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. 'అఖండ' తర్వాత బాలయ్య - 'క్రాక్' తర్వాత గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.