Begin typing your search above and press return to search.

కుంభమేళాపై బాలీవుడ్ యాంక‌ర్‌ పోస్టు.. చంపుతామంటూ బెదిరింపులు!

By:  Tupaki Desk   |   16 April 2021 2:30 AM GMT
కుంభమేళాపై బాలీవుడ్ యాంక‌ర్‌ పోస్టు.. చంపుతామంటూ బెదిరింపులు!
X
దేశంలో ఒక రోజు న‌మోద‌య్యే క‌రోనా కేసుల సంఖ్య దాదాపు 2 ల‌క్ష‌ల‌కు చేరుకుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో దేశ‌వ్యాప్తంగా ఎంతో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల్సిన స‌మ‌యం. రాష్ట్రాల‌న్నీ క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లకు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో.. ఉత్త‌ర ప్ర‌దేశ్ లో కుంభ‌మేళా నిర్వ‌హిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ ఏకంగా 6 ల‌క్ష‌ల మంది భ‌క్తులు హ‌రిద్వార్ కు వెళ్లి స్నానాలు చేస్తున్నారు.

దీనిపై సోష‌ల్ ‌మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ టీవీ యాంక‌ర్ క‌ర‌ణ్ వాహి కూడా ఓ పోస్టు చేశాడు. ''బాబాల సంప్రదాయా‌నికి వ‌ర్క్ ఫ్రమ్ హోం అనే ఆప్ష‌న్‌ లేదా? గంగాజలంతో స్నానానికి బదులు ఇంట్లోనే స్నానం చేయొచ్చు కదా''అని పోస్టు చేశాడు.

దీనికి ఎవ‌రి మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయో తెలియ‌దుగానీ.. ఏకంగా చంపేస్తామంటూ క‌ర‌ణ్ కు బెదిరింపు మెసేజ్ లు చేశారు. ఈ పోస్టును వెంట‌నే డెలీట్ చేయాల‌ని, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపుతామ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. ఈ బెదిరింపుల‌కు ధీటుగా బ‌దులిచ్చాడు క‌ర‌ణ్ వాహి.

''నన్ను చంపుతామంటూ చాలా బెదిరింపులు వచ్చాయి. అంటే.. మీరు హిందువు అయినంత మాత్రాన కొవిడ్ నిబంధనలు గాలికి వదిలేయాలా? రూల్స్ బ్రేక్ చేసే ముందు హిందువుకు అసలైన అర్థం తెలుసుకోండి'' ఘాటుగా సమాధానం చెప్పాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు క‌ర‌ణ్‌. ఈ బెదిరింపుల‌పై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నిజం మాట్లాడితే చంపేస్తామ‌ని బెదిరిస్తారా అని ఫైర్ అవుతున్నారు నెటిజ‌న్లు.