Begin typing your search above and press return to search.

'పుష్ప' కి బాలీవుడ్ దర్శకుడు ఫిదా.. సుక్కూ కు పర్సనల్ గా మెసేజ్..!

By:  Tupaki Desk   |   11 Jun 2022 9:30 AM GMT
పుష్ప కి బాలీవుడ్ దర్శకుడు ఫిదా.. సుక్కూ కు పర్సనల్ గా మెసేజ్..!
X
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన ''పుష్ప: ది రైజ్'' సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. గతేడాది చివర్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 350 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ముఖ్యంగా హిందీ సర్క్యూట్స్ లో ఎలాంటి అంచనాలు లేకుండా 100 కోట్లకు పైగా వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

'పుష్ప' సినిమాకు నార్త్ ఆడియన్స్ నుంచే కాదు.. బాలీవుడ్ సినీ ప్రముఖులు మరియు ఇతర సెలబ్రిటీల నుంచి కూడా ప్రశంసలు వర్షం కురిసింది. పుష్పరాజ్ గా బన్నీ నటన - సుకుమార్ టేకింగ్ మరియు దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని మెచ్చుకుంటూ అందరూ ట్వీట్లు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ 'పుష్ప' సినిమాకు ఫిదా అయ్యారు.

'మున్నాబాయ్ ఎంబీబీఎస్' 'మున్నాభాయ్ జిందాబాద్' 'త్రీ ఇడియట్స్' 'పీకే' 'సంజు' వంటి చిత్రాలను తెరకెక్కించిన రాజ్ కుమార్ హిరాణీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో 'డుంకీ' చిత్రాన్ని తీస్తున్న హిరానీ.. ఇటీవల 'పుష్ప' చిత్రాన్ని చూసి డైరెక్టర్ సుకుమార్ ను ప్రశంసించారు. సుకుమార్ నంబర్ తెలుసుకుని ఈ మేరకు ప్రత్యేకంగా మెస్సేజ్ పంపించారు.

"గుడ్ మార్నింగ్ సుకుమార్ జీ.. నేను రాజ్ కుమార్ హిరాణీ. 'పుష్ప' సినిమా చూసిన తర్వాత చాలా రోజుల క్రితమే మీకు మెస్సేజ్ చెయ్యాల్సింది. కానీ మీ నంబర్ నా వద్ద లేదు. నిన్ననే నేను మహవీర్ జైన్ ను కలిశాను. ఆ సమయంలో మేము మీ గురించే మాట్లాడుకున్నాం. అలా మీ నంబర్ నాకు దొరికింది. మీరు ఎంత అద్భుతమైన సినిమా చేశారో చెప్పాలనుకుంటున్నాను. నేను దాని గురించి చాలా మందితో చెప్పాను. నేను చెప్పే విధానం చూసి నాకేదో అయ్యిందన్నట్లు వాళ్లు ఆశ్చర్యపోయారు''

''నేను మీ రచనను ఇష్టపడ్డాను. ఒక సన్నివేశాన్ని మించి మరొక సీన్ ను తెరకెక్కించిన విధానం అసాధారణం. అద్భుతమైన పెర్ఫార్మన్సులు - సంగీతం - బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. ఇదొక గొప్ప ఎంటర్టైనర్. నిజంగా నేను సినిమా చూసి చాలా ఆనందించాను. ఇలాంటి అద్భుతమైన సినిమాలు చేస్తూనే ఉండండి. మీరు ఎప్పుడైనా వస్తే తప్పకుండా నాకు ఒక్కసారి ఫోన్ చేయండి" అని సుకుమార్ కు హిరాణీ మెసేజ్ చేశారు.

రాజ్ కుమార్ హిరాణీ సందేశానికి సుకుమార్ ఉబ్బితబ్బిబయ్యారు. "సార్.. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ గా చెప్పుకునే మీ నుంచి మెసేజ్ రావడం నాకెంతో ఆనందంగా ఉంది. మీరు పంపించిన సందేశాన్ని నా స్నేహితులందరికీ ఫార్వర్డ్ చేయడం వల్ల మీకు రిప్లై ఆలస్యంగా ఇస్తున్నాను. ఫిల్మ్ మేకింగ్ మరియు రైటింగ్ లో మీరు నాకు చాలా ఇన్స్పిరేషన్ సార్" అని హిరానీ మెసేజ్ కు సుకుమార్ ప్రతిస్పందించారు. రాజ్ కుమార్ హిరాని - సుక్కూ మధ్య చాటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది.

ఇకపోతే 'పుష్ప 1' బ్లాక్ బస్టర్ అవడంతో రెండో భాగం 'పుష్ప: ది రూల్' పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. శేషాచలం అడవుల్లో కూలీగా జీవితాన్ని మొదలు పెట్టిన పుష్పరాజ్.. ఎర్ర చందనం స్మగ్లింగ్ సిండికేట్ ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది మొదటి భాగంలో చూపించారు. ఇప్పుడు రెండో పార్ట్ లో ఎలాంటి కథను చెప్పబోతున్నారని ప్రేక్షకులలో ఆసక్తి ఎక్కువైంది.

నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని మేకర్స్ భావించారు. అయితే మొదటి భాగానికి మించి తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో.. ప్రీ ప్రొడక్షన్ కే ఎక్కువ సమయం కేటాయించడంతో ఆలస్యమైంది. అయితే దసరా పండుగ సందర్భంగా 'పుష్ప 2' సినిమాని ప్రారంభించనున్నారని టాక్ నడుస్తోంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించనుంది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఈ యాక్షన్ డ్రామా విడుదల కానుంది.