Begin typing your search above and press return to search.

సాయిధరమ్ తేజ్ పై త్వరలో ఛార్జ్ షీట్?

By:  Tupaki Desk   |   28 Dec 2021 3:30 AM GMT
సాయిధరమ్ తేజ్ పై త్వరలో ఛార్జ్ షీట్?
X
బైక్ యాక్సిడెంట్ కేసులో మెగా ఫ్యామిలీకి చెందిన సాయిధరమ్ తేజ్ కు పంపిన నోటీసులపై స్పందించడం లేదని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని వారు తెలిపారు.

దీనిపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. బైక్ ప్రమాదం కేసులో సాయిధరమ్ కు నోటీసులు పంపించగా ఆయన ఇప్పటివరకూ స్పందించలేదని చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదైందని.. అందువల్ల లైసెన్స్, బైక్ ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే సాయిధరమ్ తేజ్ మాత్రం దీనికి స్పందించలేదని తెలిసింది. అయినప్పటికీ త్వరలోనే ఆయనపై ఛార్జిషీటు దాఖలు చేస్తామని తెలిపారు.

గత ఏడాది సైబరాబాద్ పరిధిలో జరిగిన నేరాలు, రహదారి ప్రమాదాలకు సంబంధించి ఆయన ఒక వార్షిక నివేదికను విడుదల చేశారు. ఇందులో ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 759 మంది మరణిస్తే.. వీరిలో 80 శాతం మంది తలకు హెల్మెట్లు ధరించకపోవడంతో చనిపోయారని వివరించారు.

అలాగే 712 రోడ్డు ప్రమాద కేసుల్లో మద్యం సేవించి వాహనం నడపడం వల్ల 212 ప్రమాదాలు జరిగినట్లు తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వాహన చోదకుల నుంచి రూ.4.50 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు చెప్పారు. అలాగే 9981 వాహన చోదకుల లైసెన్సులు రద్దు చేసినట్లు ఆయన వివరించారు.