Begin typing your search above and press return to search.

ఛ‌త్ర‌ప‌తి శివాజీ బ‌యోపిక్.. అంద‌రి నోళ్లు మూయిస్తాడా?

By:  Tupaki Desk   |   3 Nov 2022 5:30 PM GMT
ఛ‌త్ర‌ప‌తి శివాజీ బ‌యోపిక్.. అంద‌రి నోళ్లు మూయిస్తాడా?
X
బాహుబ‌లి ఫ్రాంఛైజీ త‌ర్వాత బాలీవుడ్ లో తానాజీ 3డి హిస్టారిక‌ల్ నేప‌థ్యంలో వ‌చ్చి ఘ‌న‌విజ‌యం అందుకుంది. కానీ అంత‌కుముందు ఆ త‌ర‌వాత వ‌చ్చిన చాలా హిస్టారిక‌ల్ జాన‌ప‌ద చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాయి. అయినా కానీ ఇప్ప‌టికీ చ‌రిత్ర‌ను త‌వ్వుతూ అక్క‌డ ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు క‌థ‌లు రాస్తూనే ఉన్నారు. కానీ ఈసారి చాలా ప్ర‌త్యేక‌త క‌లిగిన రారాజు క‌థ‌ను ఎంచుకుని ఖిలాడీ అక్ష‌య్ కుమార్ ని ఎంపిక చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది.

ఛత్రపతి శివాజీ మహారాజ్ పై బాలీవుడ్ లో తాజాగా ఒక చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి మహేష్ మంజ్రేకర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 'వీర్ దౌడలే సాత్' అనేది టైటిల్‌. 2023 దీపావళికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆసక్తికరంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తుండ‌డంతో ఫ్యాన్స్ లో ఉత్కంఠ నెల‌కొంది.

ముంబై మీడియా స‌మాచారం మేర‌కు.. ఈ చిత్రం మరాఠీలో రూపొందుతుంది. ఇది అక్షయ్ కు మరాఠీ అరంగేట్ర చిత్రం కానుంది. అయితే ఈ సినిమా ఇతర భాషల్లో కూడా విడుదలవుతుంది. ఇది తనపై ఉంచిన బృహ‌త్త‌ర‌ బాధ్యత అని.. ఇది తనకు డ్రీమ్ రోల్ అని అక్షయ్ అన్నారు. నిజానికి అక్షయ్ కుమార్ ఇప్ప‌టికే భారీ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. అత‌డు డిఫరెంట్‌ జోనర్ ల సినిమాలు చేయాలని ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఈ సంవత్సరం అతను యాక్షన్ కామెడీ-బచ్చన్ పాండే... హిస్టారికల్ డ్రామా-సామ్రాట్ పృథ్వీరాజ్... ఫ్యామిలీ ఎంటర్ టైనర్- రక్షా బంధన్.. మర్డర్ మిస్టరీ -కట్ పుట్ల్లి .. యాక్షన్ అడ్వెంచర్ -రామసేతులో కనిపించాడు. ఇవేగాక‌ ఇప్పటికే అరడజనుకు పైగా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.

కొంతకాలం క్రితం అక్ష‌య్ మరో భారీ చిత్రం చేస్తున్నాడని అందులో అతను ఒక ఐకానిక్ క్యారెక్టర్ చేయబోతున్నాడని గుస‌గుస‌లు వినిపించాయి. ఇంత‌లోనే ఈరోజు ముంబయిలో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్ లో అక్షయ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రను పోషిస్తున్నార‌ని రివీల్ చేయ‌డంతో అంద‌రిలో ఒక‌టే విస్మ‌యం క‌లిగింది. ఆసక్తికరంగా చిత్ర‌బృందం పంపిన ఆహ్వానంలో అక్షయ్ కుమార్ చిత్రంలో భాగమని లేదా ఈవెంట్ కు హాజరవుతారని కూడా పేర్కొనలేదు. అక్కడున్న జర్నలిస్టులను షాక్ కి గురిచేసిన విష‌య‌మిది. సూపర్ స్టార్ అక్ష‌య్ పేరు ఒక్కసారిగా తెర‌పైకి వచ్చింది. అత‌డు అక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే - మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత ..వ్యవస్థాపకుడు రాజ్ థాకరేతో పాటు స్వయంగా మహేష్ మంజ్రేకర్ కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజరయ్యారు.

'వీర్ దౌదలే సాత్' కేవలం మరాఠీలోనే కాకుండా హిందీ- తమిళం- తెలుగు భాషల్లో కూడా విడుదల కానుంది. వసీమ్ ఖురేషి కి చెందిన‌ ఖురేషి ప్రొడక్షన్స్ లో ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీనిని 2023 దీపావళికి విడుదల చేస్తారు. అంటే సూర్యవంశీ (2021) .. రామ్ సేతు తర్వాత అక్షయ్ కుమార్ కి ఇది వరుసగా మూడవ ప్ర‌త్యేక‌ దీపావళిగా మార‌నుంది.

అయితే ఉన్న‌ట్టుండి ఛ‌త్ర‌ప‌తి శివాజీ బ‌యోపిక్ పై ఆక‌స్మిక‌ ప్రకటన చేయ‌డం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవల అక్షయ్ కుమార్ న‌టించిన 'సామ్రాట్ పృథ్వీరాజ్' అదే జానర్ లో వచ్చింది. కానీ చిత్రం విజయవంతం కాలేదు. అక్ష‌య్ పైనా తీవ్ర విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. అందుకే ఈ లెజెండరీ క్యారెక్టర్ ని అక్షయ్ కి ఆఫ‌ర్ చేయ‌డం తో ఒక సెక్ష‌న్ లో కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే త‌న‌దైన రాజ‌సంతో గొప్ప న‌ట‌న‌తో అక్ష‌య్ అంద‌రి నోళ్లు మూయించాల్సి ఉంటుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.