Begin typing your search above and press return to search.

ఆమెను చూసేందుకు గాంధీకి వస్తానని చెప్పిన చిరంజీవి

By:  Tupaki Desk   |   27 Aug 2022 6:30 AM GMT
ఆమెను చూసేందుకు గాంధీకి వస్తానని చెప్పిన చిరంజీవి
X
తాజాగా జరిగిన ఒక సంఘటన మెగాస్టార్ చిరంజీవిని కదిలించింది. తాజాగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో స్పృహలో ఉంచి నిర్వహించిన ఆపరేషన్ ఉదంతం చిరంజీవి వరకు వెళ్లింది. ఆపరేషన్ సమయంలో ఆమెను స్పృహలో ఉంచి.. ఆమెకు చిరు నటించిన 'అడవి దొంగ' సినిమా చూపిస్తూ.. తరచూ మాట్లాడిస్తూ.. మెదడులోని కణితిని తొలగించిన వైనం తెలిసిందే. దీనికి సంబంధించిన వార్త మీడియాలో వచ్చింది.

ఇదే విషయం మెగాస్టార్ వరకు వెళ్లింది. దీంతో.. ఆయన తన పీఆర్వోను గాంధీ ఆసుపత్రికి పంపారు. పేషెంట్ కు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలని కోరారు. దీంతో.. చిరు పీఆర్వో ఆనంద్ గాంధీకి వెళ్లి.. ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు ను కలిశారు. ఈ సందర్భంగా అతనికి పేషెంట్ ను పరిచయం చేశారు.

సదరు పెద్ద వయస్కురాలితో చిరు వ్యక్తిగత సిబ్బంది మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను చిరంజీవి అభిమానినని.. ఆయన సినిమాలన్నింటిని చూస్తానని చెప్పింది. ఆ వివరాల్ని ఆసుపత్రి నుంచే చిరంజీవికి వివరించి చెప్పగా.. సానుకూలంగా స్పందించిన చిరు.. రెండు మూడు రోజుల వ్యవధిలోనే తాను గాంధీకి వస్తానని తెలియజేశారు.

ఇదే విషయాన్ని చిరు పీఆర్వో ఆనంద్ ఆసుపత్రి సుపరింటెండెంట్ కు తెలియజేశారు. ఏమైనా.. తన అభిమానికి సంబంధించిన సమాచారం తెలిసినంతనే వారిని అలెర్ట్ చేసి.. వారి యోగక్షేమాలు తెలుసుకునే విషయంలో చిరు మరోసారి తన మార్కును ప్రదర్శించారన్న మాట వినిపిస్తోంది. చిరు కానీ గాంధీకి వెళితే.. సదరు పెద్ద వయస్కురాలికి అంతకు మించిన సాంత్వన ఇంకేం ఉంటుంది?