Begin typing your search above and press return to search.

'పుష్ప' డైలాగ్ ను వివిధ మాడ్యులేషన్లలో పలికి ఆశ్చర్యపరిచిన చియాన్..!

By:  Tupaki Desk   |   25 Aug 2022 10:51 AM GMT
పుష్ప డైలాగ్ ను వివిధ మాడ్యులేషన్లలో పలికి ఆశ్చర్యపరిచిన చియాన్..!
X
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప: ది రైజ్' సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం ముఖ్యంగా నార్త్ సర్క్యూట్స్ లో ప్రభంజనం సృష్టించింది. ఎంత కలెక్ట్ చేసిందనేది పక్కన పెడితే.. సినిమా వచ్చి ఇన్ని నెలలు గడిచినా పుష్ప మేనియా ఏమాత్రం తగ్గలేదు.

ఇందులో బన్నీ పలికిన డైలాగులు మరియు మేనరిజమ్స్ ఎంతటి ప్రభావం చూపించాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు వాటిని ఇమిటేట్ చేశారు. అనేకమంది నటీనటులు క్రీడాకారులు అల్లు అర్జున్ స్టైల్ లో 'తగ్గేదేలే' అంటూ డైలాగ్స్ చెబుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.. 'పుష్ప అంటే ఫ్లవరనుకున్నావా.. కాదు ఫైరు' అంటూ రీల్స్ చేస్తున్నారు.

'పుష్ప' సినిమాలో పాపులర్ అయిన డైలాగ్స్ ను ఇప్పుడు లేటెస్టుగా దక్షిణాది అగ్ర హీరోలలో ఒకరైన చియాన్ విక్రమ్ పలకడం విశేషం. 'కోబ్రా' సినిమా ప్రమోషన్లలో భాగంగా 'పుష్ప అంటే ఫ్లవర్ ఫ్లవరనుకున్నావా.. ఫైరూ' అనే డైలాగ్ ను చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచాడు.

మీడియా ఇంటరాక్షన్ లో 'పుష్ప' సినిమా గురించి ప్రస్తావించగా.. బన్నీ చెప్పిన డైలాగ్ ను పలికాడు. కేవలం డైలాగ్ చెప్పి వదిలేయకుండా.. వివిధ మాడ్యులేషన్లలో డైలాగ్స్ చెబుతూ పది రకాల వేరియేషన్లు చూపించారు. అలానే తాను నటించిన 'జెమిని' సినిమాలోని 'ఓ పోడు' మేనరిజంతో 'పుష్ప' డైలాగ్‌ చెప్పి అందరినీ ఆకట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఇక్కడ మరో విశేషమంటే.. విక్రమ్ 'పుష్ప' సినిమా డైలాగ్స్ ఇక్కడ మన తెలుగు మీడియా ముందు చెప్పలేదు.. తమిళనాట కోయంబత్తూరులో జరిగిన ప్రెస్ మీట్ లో తెలుగు సినిమా ప్రస్తావన రావడం.. మన హీరో డైలాగ్‌ ను విలక్షణ నటుడు ఇన్ని వేరియేషన్లలో చెప్పడం గొప్ప విషయమేనని చెప్పాలి. ఇది పుష్ప క్రేజ్ ఎలా ఉందో మరోసారి గుర్తు చేస్తోంది. మరి 'పుష్ప 2' తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

ఇకపోతే వైవిధ్యమైన చిత్రాలు - విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న విక్రమ్.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలతో వస్తున్నారు. చియాన్ నటించిన 'కోబ్రా' మరియు 'పొన్నియన్ సెల్వన్' వంటి సినిమాలు కొద్ది రోజుల వ్యవధిలోనే థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.

అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన 'కోబ్రా' సినిమా ఆగస్టు 31న విడుదల కాబోతోంది. ఇందులో శ్రీనిధి శెట్టి - మృణాళిని హీరోయిన్లుగా నటించారు. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషించారు. లలిత్ కుమార్మరియు ఉదయనిది స్టాలిన్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు.

ఇక లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్ నటించిన 'PS' పార్ట్-1 మూవీ పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 30న రిలీజ్ కాబోతోంది. ఇందులో కార్తీ - జయం రవి - ఐశ్వర్యారాయ్ - త్రిష ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్ & మద్రాస్ టాకీస్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి కూడా ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చడం విశేషం.