Begin typing your search above and press return to search.

కమేడియన్ ఆలీ చెప్పిన సీరియస్ మాటలు వింటే..

By:  Tupaki Desk   |   28 Nov 2016 5:23 AM GMT
కమేడియన్ ఆలీ చెప్పిన సీరియస్ మాటలు వింటే..
X
తెర మీద తన కామెడీతో అలరించే కమేడియన్ అలీ నోటి నుంచి వచ్చిన మాటలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. తన హాస్యంతో అందరిని అలరించే ఆయన.. తాజాగా గుంటూరులో జరిగిన ‘జాగో ముస్లిం.. చలో గుంటూరు’ పేరిట నిర్వహించిన సభకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మైనార్టీల ఓట్లును ఎక్కువగా వేయించుకున్న రాజకీయ పార్టీలు తామిచ్చిన హామీల్ని నెరవేర్చటం తర్వాత.. ముస్లింలకే టోపీలు పెడుతున్నాయంటూ ఫైర్ అయ్యారు. అంతేకాదు.. భవిష్యతులో ముస్లింలు ఎలా ఓటు వేయాలన్న విషయానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు.

2019 ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలకు ఏ పార్టీ అయితే ఎక్కువ సీట్లు కేటాయిస్తుందో ఆ పార్టీకే ముస్లింలంతా ఓట్లు వేయాలని అలీ పిలుపునిచ్చారు. పొలిటిషియన్స్ టోపీలు పెట్టుకుంటూ తిరగటమే కాదు.. ముస్లింలకు టోపీలు పెడుతున్నారన్న ఆయన.. సమిష్టి కృషితో ముస్లింలు ఎదగాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ముస్లింలకు రాజకీయ పార్టీలు టోపీలు పెడుతున్నాయంటూ సీరియస్ అయిన అలీ మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఏదైనా సభకు హాజరైతే.. తన చిలిపి మాటలతో.. హాస్యపు జల్లులతో సభలో ఉత్సాహాన్ని రేకెత్తించే అలీ.. అందుకు భిన్నంగా తాజా సభలో మాత్రం మైనార్టీల హక్కుల గురించి.. రాజకీయ పార్టీలతో ముస్లింలు ఎలా డీల్ చేయాలన్న విషయాన్ని చెప్పటం గమనార్హం. అంతేకాదు.. బలవంతపు మత మార్పిళ్లు మంచికాదన్న మాట ఆయన నోటి నుంచిరావటం గమనార్హం. చూస్తుంటే.. అలీ రానున్న రోజుల్లో తనలోని సీరియస్ కోణాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోందనే చెప్పాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/