Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: ప్రభాస్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..?

By:  Tupaki Desk   |   10 Oct 2022 11:27 AM GMT
బ్రేకింగ్: ప్రభాస్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ''ఆదిపురుష్''. రామాయణం ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓ రౌత్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇటీవల ఈ పౌరాణిక చిత్రం టీజర్ విడుదల చేసిన తర్వాత వివాదంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ మరియు మేకర్స్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల అయోధ్య వేదికగా 'ఆది పురుష్' టీజర్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో వీఎఫ్ఎక్స్ నాసిరకంగా ఉన్నాయని.. గ్రాఫిక్స్ వర్క్ చూస్తుంటే ఒక కార్టూన్ సినిమా చూస్తున్నట్లు ఉందని నెటిజన్లు ట్రోల్ చేశారు. అదే సమయంలో ఇది హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని హిందుత్వ వాదులు మరియు కొందరు రాజకీయ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

'ఆది పురుష్' సినిమాలో శ్రీరాముడు మరియు హనుమంతుడిని అవమానించేలా చిత్రీకరించారని.. రావణుడి పాత్రని కూడా అభ్యంతరకరంగా డిజైన్ చేసారని ఆరోపించారు. రామాయణాన్ని ఏమాత్రం పరిశోధన చేయకుండా ఈ సినిమా తీశారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ న్యాయవాది రాజ్ గౌరవ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

'ఆదిపురుష్' సినిమాలో హిందువుల మనోభావాలు గాయపరిచారని.. ఈ మూవీ విడుదలపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు స్వీకరించింది. దీనిని పరిశీలించిన న్యాయస్థానం.. హీరో ప్రభాస్ మరియు చిత్ర నిర్మాతలకు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పిటిషనర్ల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని చిత్ర యూనిట్ ని కోర్టు ఆదేశించింది.

'ఆదిపురుష్' సినిమాలో ఓ వర్గం దేవుళ్లను తప్పుగా.. అసమంజసమైన సరికాని విధంగా చిత్రీకరించారని ఆ పిటిషనర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. హిందువుల విశ్వాసం ప్రకారం.. రాముడు ప్రశాంతంగా, ఉదారంగా ఉండేవాడు. కానీ టీజర్ లో క్రూరమైన ప్రతీకార రూపంగా చూపారని.. రాముడు - హనుమంతుడు పాత్రలు రబ్బరు దుస్తులు ధరించి ఉన్నాయని.. రావణుడి పాత్ర చిత్రణ చాలా భయంకరంగా ఉందని ఆరోపించారు.

హిందువుల మత, సాంస్కృతిక, చారిత్రక, నాగరికత మనోభావాలను దెబ్బతీసేలా మూడు పాత్రలను టీజర్‌ లో చూపించారని.. ఈ సినిమాపై నిషేధం విధించాలని పిటిషనర్ కోరారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిత్ర బృందానికి హైకోర్టు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరి దీనిపై మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

కాగా, 'ఆదిపురుష్‌' సినిమాలో రాఘవగా ప్రభాస్ నటించగా.. జానకిగా కృతి సనన్ నటించింది. లంకేశ్ గా సైఫ్ అలీ ఖాన్ మరియు లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కీలక ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. టీ-సిరీస్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు..



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.