Begin typing your search above and press return to search.

'థ్యాంక్యూ' టికెట్ రేట్స్‌.. ఈసారైనా న‌మ్మొచ్చా?

By:  Tupaki Desk   |   19 July 2022 8:30 AM GMT
థ్యాంక్యూ టికెట్ రేట్స్‌.. ఈసారైనా న‌మ్మొచ్చా?
X
ఈ మ‌ధ్య పాన్ ఇండియా సినిమాల‌కు టికెట్ రేట్ల‌ని భారీగా పెంచేసిన విష‌యం తెలిసిందే. దీంతో మామూలు సినిమాల రేట్లు కూడా ఇదే స్థాయిలో వుంటాయని ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం లేదు. దీని వ‌ల్ల చాలా వ‌ర‌కు టైర్ 2 హీరోల సినిమాలు, మినిమ‌మ్ బ‌డ్జెట్ సినిమాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆడియ‌న్స్ థియేట‌ర్ల‌కు రాక‌పోవ‌డంతో క‌లెక్ష‌న్ లు రాక స‌త‌మ‌త‌మ‌వుతున్నాయి. దీంతో ప్ర‌తీ సినిమా రిలీజ్ టైమ్ లో టికెట్ రేట్లు ప్ర‌ధాన చ‌ర్చ‌గా మారుతున్నాయి.

అయితే సినిమా రిలీజ్ కు ముందు రేట్లు త‌గ్గిస్తామ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టిస్తూ ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ చెప్పిన విధంగా టికెట్ రేట్లు త‌గ్గించ‌క‌పోవ‌డంతో ప‌లువురు నిర్మాత‌లు ఇప్ప‌టికే తీవ్ర విమ‌ర్శ‌ల‌ని ఎదుర్కొన్నారు.

గోపీచంద్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ల‌ పై బ‌న్నీవాసు నిర్మించిన సినిమా `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్`. ఈ మూవీ రిలీజ్ కు ముందు గీతా ఆర్ట్స్ వ‌ర్గాలు టికెట్ రేట్ల‌ని త‌గ్గించామ‌ని చెప్పారు. కానీ థియేట‌ర్ల‌కు వెళితే ఎప్ప‌టిలాగే టికెట్ రేట్ల‌ని వ‌సూలు చేశారు.

దీంతో భారీ స్థాయిలో వారిపై విమర్శ‌లు వెల్లువెత్తాయి. తాజాగా `థాంక్యూ` సినిమాకు టికెట్ రేట్ల‌ని త‌గ్గిస్తున్న‌ట్టుగా దిల్ రాజు ప్ర‌క‌టించారు. ఈ మూవీ జూలై 22న విడుద‌ల కాబోతోంది. దీనికి సింగిల్ స్క్రీన్ ల‌లో రూ. 112, మ‌ల్టీప్లెక్స్ ల‌లో రూ.177 గా టికెట్ రేటుని ఫైన‌ల్ చేశామ‌ని చెప్పారు. అయితే ఇది నిజంగా అమ‌లు చేస్తారా? లేక గీతా ఆర్ట్స్ వారి `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` లాగే చేస్తారా? అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

దిల్ రాజు ఎంత‌గా నొక్కి మ‌రీ చెబుతున్నా స‌గ‌టు ఆడియ‌న్ న‌మ్మ‌డం లేదు. థియేట‌ర్ కు వెళ్ల‌క ముందు ఓ మాట వెళ్లాక ఓ మాట వినిపిస్తోంద‌ని, ఈ సారైనా టికెట్ రేట్ల‌ని త‌గ్గించామ‌ని చెబుతున్న దిల్ రాజు మాటలు న‌మ్మొచ్చా అని నెటిజ‌న్ లు కామెంట్ లు చేస్తున్నార‌ట‌. ఇదిలా వుంటే `థాంక్యూ` మూవీలో నాగ‌చైత‌న్య హీరోగా న‌టించారు. రాశీఖ‌న్నా, మాళ‌విక నాయ‌ర్‌, అవికా గోర్ హీరోయిన్ లు. ఓ యువ‌కుడి జీవితంలోని వివిధ ద‌శ‌ల్లో సాగే అంద‌మైన జ‌ర్నీగా ఈ మూవీని రూపొందించారు.

విక్ర‌మ్ కె. కుమార్ తెర‌కెక్కించిన ఈ మూవీపై చై, రాశీఖన్నా, అవికా గోర్, మాళ‌విక నాయ‌ర్ భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. ఈ సినిమా హిట్ అయితే రాశీ తో పాటు అవికా గోర్, మాళ‌విక నాయ‌ర్ కెరీర్ మలుపు తిరుగుతుంది. జూలై 22న విడుద‌ల కానున్న ఈ మూవీ ఎలాంటి ఫ‌లితాన్ని అందించ‌నుందో వేచి చూడాల్సిందే.