Begin typing your search above and press return to search.

ఈ అవార్డు ఓదార్పు అంటున్న దిల్ రాజు

By:  Tupaki Desk   |   8 April 2017 1:06 PM GMT
ఈ అవార్డు ఓదార్పు అంటున్న దిల్ రాజు
X
ఈ ఏడాది సంక్రాతికి ‘శతమానం భవతి’.. ఆ తర్వాతి నెలలో ‘నేను లోకల్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో చాలా ఉత్సాహంగా కనిపించాడు దిల్ రాజు. నిర్మాతగా ఆయన కెరీర్ మళ్లీ ఒకప్పటి పీక్స్ ను అందుకున్నది ఇప్పుడే. ఈ విజయాలతో చాలా సంతోషంగా ఉన్న టైంలో ఆయన్ని.. ఆయన కుటుంబాన్ని పెద్ద విషాదం తాకింది. దిల్ రాజు సతీమణి అనిత గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. దీంతో మూడు నాలుగు వారాలుగా ఇంటిపట్టునే ఉండిపోయాడు రాజు. ఈ టైంలో అసలు బయటికే రాలేదు. మొన్ననే ‘చెలియా’ ప్రెస్ మీట్ పెడితే.. ఆ రోజు మళ్లీ మీడియా ముందుకొచ్చాడు రాజు. ఆ రోజు కూడా తన ఇంట్లో జరిగిన విషాదం గురించి ఆయన మాట్లాడలేదు.

ఐతే తన సినిమా ‘శతమానం భవతి’ మోస్ట్ పాపులర్ మూవీగా జాతీయ అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో హర్షం ప్రకటిస్తూ తన భార్య మరణంతో తాను పడుతున్న బాధ గురించి ప్రస్తావించారు రాజు. ‘‘గత నెల రోజులుగా నేను పెద్ద శోకం నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇలాంటి టైంలో ఈ అవార్డు ఆ బాధ నుంచి కోలుకుని పునరుత్తేజం పొందడానికి ఉపయోగపడేదే. నా 14 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఇది తొలి జాతీయ అవార్డు. దీన్ని నేనొక బాధ్యతలాగా భావిస్తాను. భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు నిర్మించే ప్రయత్నం చేస్తాను’’ అని దిల్ రాజు పేర్కొన్నాడు. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ‘శతమానం భవతి’ భారీ వసూళ్లతో పాటు జాతీయ అవార్డు కూడా తెచ్చిపెట్టడం ఆ చిత్ర బృందం సంతోషాన్ని రెట్టింపు చేసేదే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/