Begin typing your search above and press return to search.

'ఆర్ఆర్ఆర్‌' కోసం మొద‌ట అనుకున్న హీరోలు ఎవ‌రో తెలుసా?

By:  Tupaki Desk   |   24 March 2022 12:30 PM GMT
ఆర్ఆర్ఆర్‌ కోసం మొద‌ట అనుకున్న హీరోలు ఎవ‌రో తెలుసా?
X
'ఆర్ఆర్ఆర్' మ‌రి కొన్ని గంట‌ల్లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. దేశ‌వ్యాప్తంగా ఎక్క‌డ చూసినా ఈ సినిమా హంగామానే క‌నిపిస్తోంది. థియేట‌ర్ల వ‌ద్ద అభిమానుల హ‌డావుడి కూడా మొద‌లైపోయింది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ బిగ్గెస్ట్ మ‌ల్టీస్టారర్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఏకంగా రూ. 500 కోట్ల‌ బ‌డ్జెట్‌తో నిర్మించారు. స్టార్ రైట‌ర్, రాజ‌మౌళి తండ్రి కె. వి. విజయేంద్ర ప్రసాద్ క‌థ‌ను అందించారు.

స్వాతంత్ర్య సమరయోధులైన‌ అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవ‌తాల ఆధారంగా క‌ల్పిత క‌థ‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమా 2018లోనే సెట్స్ మీద‌కు వెళ్లింది. రెండేళ్లలో సినిమాను పూర్తి చేసి 2020 జులై 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు.

చిత్రీకరణ ఆలస్యం కావడం, ఇంత‌లోనే క‌రోనా రావ‌డంతో.. వాయిదా ప‌డుతూ ప‌డుతూ చివరాఖరకు మార్చి 25న విడుద‌ల అయ్యేందుకు సిద్ధం అవుతోంది.

ఈ నేప‌థ్యంలోనే ఆర్ఆర్ఆర్ టీమ్ అన్ని భాష‌ల్లోనూ విసృతంగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్ఆర్ఆర్ రైట‌ర్ విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొని.. సినిమా గురించి ఎన్నో విష‌యాల‌ను అంద‌రితోనూ పంచుకున్నారు. అయితే ఈ సంద‌ర్భంగా యాంక‌ర్‌.. 'హీరోల‌ను ఫైన‌ల్ చేసి, వారికి త‌గ్గ‌ట్లు క‌థను సిద్ధం చేశారా..? లేక క‌థ‌ను రెడీ చేసి, హీరోల‌ను ఫైన‌ల్ చేశారా..?' అని ప్ర‌శ్నించాడు.

అందుకు విజ‌యేంద్ర ప్ర‌సాద్ బ‌దులిస్తూ.. 'ఇద్ద‌రు స్టార్ హీరోల‌ను పెట్టి మ‌ల్టీస్టార‌ర్ చేయాల‌నే ఉద్ధేశంతో ఒక ఔట్ లైన్‌ అనుకున్నాము. ఆ త‌ర్వాత రజనీకాంత్- అర్జున్, సూర్య- కార్తీ ఇలా చాలా కాంబినేషన్స్ ప‌రిశీలించాం. చివ‌ర‌కు ఎన్టీఆర్‌-చ‌ర‌ణ్‌ల‌ను పిక్స్ చేసి పూర్తి క‌థను సిద్ధం చేశాం. పైగా హీరోలిద్ద‌రూ ముందు నుంచి మంచి స్నేహితులు కావ‌డం సినిమాకు మ‌రింత ప్లాస్ అయింది' అంటూ చెప్పుకొచ్చారు.

కాగా, ఈ పీరియాడిక్ ఫిక్షన్ మూవీలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా, చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా అల‌రించ‌బోతున్నారు. వీరి స‌ర‌స‌న బాలీవుడ్ భామ అలియా భ‌ట్‌, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ న‌టించారు. అజయ్ దేవగన్, శ్రియ, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఎం. ఎం. కీరవాణి స్వ‌రాలు స‌మ‌కూర్చారు.