Begin typing your search above and press return to search.

'దృశ్యం 2' హిందీ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే..?

By:  Tupaki Desk   |   17 Oct 2022 10:59 AM GMT
దృశ్యం 2 హిందీ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే..?
X
అత్యంత ప్రజాదరణ పొందిన ప్రాంఛైజీ సినిమాల్లో ''దృశ్యం'' ఒకటి. మోహల్ లాల్ ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఈ మలయాళ సినిమా తెరకెక్కింది. ఇప్పటి వరకు ఈ ప్రాంఛైజీలో వచ్చిన రెండు సినిమాలూ విజయం సాధించాయి. 'దృశ్యం 1' తెలుగు, తమిళ, కన్నడ హిందీలతో పాటుగా పలు ప్రధాన భారతీయ భాషల్లో రీమేక్‌ చేయబడి.. అన్ని చోట్లా విజయవంతమైంది. ఈ క్రమంలో వచ్చిన 'దృశ్యం 2' మూవీ తెలుగులో రీమేక్ చేయబడి ప్రేక్షకాదరణ పొందింది. అయితే ఇప్పుడు హిందీ ''దృశ్యం 2'' మూవీ కూడా రిలీజ్ కు రెడీ అయింది.

అజయ్ దేవగన్ - శ్రియా శరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ''దృశ్యం 2''. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టబు - అక్షయ్ ఖన్నా కీలక పాత్రలు పోషించారు. వచ్చే నెలలో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ ఈరోజు సోమవారం విడుదల చేసారు. ఓ మధ్యతరగతి కుటుంబంలో జరిగిన ఓ ఊహించని సంఘటన కారణంగా ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి.. ఆ కుటుంబ పెద్ద విజయ్ సల్గాంకర్ తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడనేది ఎంతో ఆసక్తికరంగా 'దృశ్యం 1' సినిమాలో చూపించారు.

ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే.. 'దృశ్యం' సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే 'దృశ్యం 2' మొదలైందని తెలుస్తుంది. ఏడేళ్ల క్రితం మూసివేయబడిన విజయ్ సల్గాంకర్ మరియు అతని కుటుంబానికి సంబంధించిన కేసును మళ్ళీ తిరగదోడుతున్నారు. సత్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి లోతైన దర్యాప్తు కోసం ఈసారి కొత్త ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా అక్షయ్ ఖన్నా నటించారు. తమ ప్రతీకారం - న్యాయం కోసం టబు మరియు అజయ్ దేవగన్ మళ్లీ ఒకరినొకరు ఢీకొట్టబోతున్నారు.

భార్యాపిల్లలతో కలిసి ఆనందంగా గడుపుతున్న విజయ్ లైఫ్ లోకి మళ్ళీ పోలీసులు రావడం.. తమ శైలిలో ఇన్వెస్టిగేషన్ చేయడం వంటి అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. పాత మర్డర్ కేసును తిరగదోడిన నేపథ్యంలో విజయ్ ఫ్యామిలీ మళ్లీ ఎలాంటి సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది? ఎప్పటిలాగే తన తెలివితేటలతో ఈ కేసు నుంచి బయటపడ్డారా లేదా? ఈసారి విజయ్ తన కుటుంబాన్ని కాపాడుకోగలడా? అనేది తెలియాలంటే ''దృశ్యం 2'' సినిమా చూడాల్సిందే.

మలయాళ - తెలుగు వెర్షన్స్ మాదిరిగానే ఎలాంటి మార్పులు చేయకుండా.. అదే సెటప్ తో 'దృశ్యం 2' హిందీ రీమేక్ ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ ట్రైలర్ కు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన బలంగా నిలిచింది. సుధీర్ కుమార్ చౌదరి అందించిన విజువల్స్ సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ మూడ్ ని క్యారీ చేసేలా ఉన్నాయి. సందీప్ ఫ్రాన్సిస్ దీనికి ఎడిటింగ్ చేసారు.

నిషికాంత్ కామత్ మరణించడంతో జాతీయ అవార్డు గ్రహీత అభిషేక్ పాఠక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారని తెలుస్తోంది. వైయ్ కామ్ 18 స్టూడియోస్ సమర్పణలో గుల్షన్ కుమార్ కు చెందిన T-సిరీస్ మరియు పనోరమా స్టూడియోస్ బ్యానర్స్ పై ''దృశ్యం 2'' సినిమా రూపొందింది. నవంబర్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.