Begin typing your search above and press return to search.

అమెజాన్ లెక్కేంటో అర్థం కావడం లేదే..!

By:  Tupaki Desk   |   14 Nov 2021 3:45 AM GMT
అమెజాన్ లెక్కేంటో అర్థం కావడం లేదే..!
X
కరోనా పాండమిక్ సమయంలో భారతీయ సినీ ప్రియులకు దగ్గరైన డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో. కోవిడ్ ని క్యాష్ చేసుకుంటూ డైరెక్ట్ ఓటీటీ రిలీజులను వెబ్ సిరీస్ లను ప్రేక్షకులకు అలవాటు చేశారు. తెలుగు కంటెంట్ విషయంలో కూడా టాప్ లో నిలవడానికి ప్రైమ్ ఓటీటీ గట్టిగానే ప్రయత్నాలు చేసింది. ఎన్నో క్రేజీ చిత్రాలను నేరుగా విడుదల చేయడమే కాకుండా.. సూపర్ హిట్ సినిమాలను స్ట్రీమింగ్ పెడుతోంది. అయితే ఆల్రెడీ తమ ఓటీటీలో రిలీజ్ చేసిన సినిమా రీమేక్ ని.. ఇప్పుడు డైరెక్ట్ ఓటీటీ విధానంలో విడుదల చేయడంపై సినీ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

విక్టరీ వెంకటేష్ - మీనా ప్రధాన పాత్రల్లో మలయాళ డైరెక్టర్ జీతు జోసెఫ్ తెరకెక్కించిన తాజా చిత్రం ''దృశ్యం 2''. ఇది మలయాళంలో అదే పేరుతో సూపర్ హిట్ అయిన చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్. సురేష్ ప్రొడక్షన్స్ - మాక్స్ మూవీస్ - రాజ్ కుమార్ థియేటర్స్ ప్రై. లిమిటెడ్ బ్యానర్స్ పై డి.సురేష్ బాబు - ఆంటోనీ పెరుంబవూర్ - రాజ్ కుమార్ సేతుపతి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేస్తూ ఈ మూవీని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.

డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో.. నవంబర్ 25 నుంచి ఈ సినిమాని ఓటీటీలో స్ట్రీమింగ్ పెట్టబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. మలయాళ 'దృశ్యం 2' సినిమా అమెజాన్ లోనే డైరెక్ట్ ఓటీటీ విడుదల అయింది. జీతు జోసెఫ్ డైరెక్షన్ లో మోహన్ లాల్ - మీనా ప్రధాన పాత్రలతో ఈ సినిమా రూపొందింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రికార్డు స్థాయిలో వ్యూయ‌ర్ షిప్ సాధించింది. కానీ ఇప్పుడు 'దృశ్యం' సీక్వెల్ తెలుగు రీమేక్ ని కూడా ప్రైమ్ వారు కొనడమే అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది.

'దృశ్యం 2' మలయాళ వెర్షన్ ని ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేయగా.. తెలుగు వెర్షన్ ని ఏడాది చివర్లో స్ట్రీమింగ్ పెట్టడానికి రెడీ అయ్యారు. తమ ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ అయిన కంటెంట్ ను వేరే నటీనటులను పెట్టి మళ్ళీ సినిమాగా తీస్తే.. దాన్ని అమెజాన్ వారు తీసుకోవడంలో దిగ్గజ ఓటీటీ స్ట్రాటజీ ఏంటో ఎవరికీ అంతుబట్టడం లేదు. మాతృకకు రీమేక్ చిత్రానికి మార్పులేవీ ఉండవు.. నటీనటులు మారుతారు అంతే. అందులోనూ ఓటీటీలకు అలవాటు పడిన జనాలు భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. మలయాళ 'దృశ్యం 2' చిత్రాన్ని సబ్ టైటిల్స్ తో ఆల్రెడీ తెలుగు ఆడియన్స్ కొందరు చూసేశారు.

ఒకవేళ తెలుగు వారికి ఈ చిత్రాన్ని అందించాలని అనుకుంటే ఈ మధ్య అన్ని ఓటీటీలు చేస్తున్నట్లే ఇక్కడి వారితో డబ్బింగ్ చెప్పిస్తే సరిపోయేది. అలాంటిది అమెజాన్ వారు కోట్లు కుమ్మరించి అదే కంటెంట్ ని తమ ఓటీటీలో అప్లోడ్ చేస్తే ప్రయోజనం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆల్రెడీ తమ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల రీమేక్ చిత్రాలను కూడా ప్రైమ్ వారు రిలీజ్ చేస్తుండటం గమనార్హం. 'అసురన్' సినిమా తమిళ హిందీ వెర్సన్స్ అందుబాటులో ఉండగా.. 'నారప్ప' చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడాన్ని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇకపోతే 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' 'లూసిఫర్' వంటి ఒరిజినల్స్ ఓటీటీలో ప్రసారం అవుతుండగా.. 'భీమ్లా నాయక్' 'గాడ్ ఫాదర్' వంటి రీమేక్ చిత్రాల హక్కుల కోసం అమెజాన్ సంస్థ ప్రయత్నం చేస్తోందని టాక్ వినిపిస్తోంది. మరి ఇలాంటి నిర్ణయాల వెనుక దిగ్గజ ఓటీటీ స్ట్రాటజీ ఏంటో అని సినీ ప్రియులు ఆలోచిస్తున్నారు.