Begin typing your search above and press return to search.

హీరోల్ని వదిలేసుడు.. క్యారెక్టర్ ఆర్టిస్టుల మీద ఎంత పడితే ఏం లాభం?

By:  Tupaki Desk   |   1 Sep 2022 3:30 PM GMT
హీరోల్ని వదిలేసుడు.. క్యారెక్టర్ ఆర్టిస్టుల మీద ఎంత పడితే ఏం లాభం?
X
ఏడాదికి డజనుకు పైగా సినిమాలు విడుదలయ్యే పెద్ద హీరోల తరం ముగిసి చాలా కాలమే అయ్యింది. ఏడాదికి ఒక సినిమా చేస్తే అదే గొప్ప అనే వరకు విషయం వెళ్లింది. ఒక సినిమా నటుడికి అతడి ప్రొఫెషన్ నటించటమే అవుతుంది. అలాంటప్పుడు తానే చేసే పనిని తాను చేయకుండా.. దాన్ని నెలల తరబడి నానుస్తూ.. ఆచితూచి అన్నట్లుగా ఏడాదికి ఒక్క సినిమా చేయటమే గగనమన్నట్లుగా పెద్ద హీరోలు మారి చాలాకాలమే అయ్యింది. ఎందుకిలా? అంటే ఎవరికి వారు చెప్పే కారణాలు ఉన్నా.. వాటిల్లో కామన్ గా వినిపించేది మాత్రం 'బడ్జెట్' అన్న మాట.

ఇంతకీ సినిమా బడ్జెట్ ను ఎవరు పెంచుతున్నారు? అన్న ప్రశ్న వేస్తే.. చిన్నప్పుడు చదువుకున్న రాజుగారి ఏడు చేపల కథ గుర్తుకు రావటం ఖాయం. ఎవరికి వారు తమకు తాము కారణం కాదని.. వేర్వేరు కారణాలు చూపించటం కనిపిస్తుంది. ఎవరు అవునన్నా.. కాదన్నా.. సినిమాకు సంబంధించినంత వరకు పెద్ద సినిమాలకు హీరో.. చిన్న సినిమాలకు దర్శకుడు మాత్రమే బడ్జెట్ ను డిసైడ్ చేస్తారని చెప్పక తప్పదు.

చిన్న సినిమాల ఖర్చు పెరిగే విషయాన్నిపక్కన పెడితే.. పెద్ద సినిమాల విషయానికి వస్తే మాత్రం పూర్తిగా హీరోలదే కారణమని చెప్పక తప్పదు. ఏడాది.. రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్నప్పుడు.. తమ ప్రధాన వ్యాపకమైన సినిమా నుంచే ఏడాదిన్నర ఆదాయాన్ని ఆశించటం మామూలే. అందుకే.. తమ రెమ్యునరేషన్ ను భారీగా పెంచేస్తున్నారు. అయితే.. ఖాళీగా ఉంటాం కానీ.. సినిమా మాత్రం ఓకే అనేందుకు సిద్దంగా లేకపోవటమే అసలు సమస్యంతా.

అంతకంతకూ రెమ్యునరేషన్ పెంచేస్తూ.. సినిమాను ఒక ప్రమాదకరమైన ఆటగా మార్చేశారు. దర్శకుడు రాజమౌళి విషయాన్నే తీసుకుంటే.. ఇప్పటివరకు ఆయన సినిమా ప్లాప్ కాలేదు కాబట్టి సరిపోయింది. ఆయన కూడా భారీ బడ్జెట్ తో రెండు.. మూడేళ్లకు ఒక సినిమా తీయటంతో రిస్కు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా.. ఎవరో ఒకరు చేసిన పనిని మిగిలిన హీరోలంతా పాలోకావటంతో ఇప్పుడు అగ్ర హీరో అంటే ఏడాదికి.. ఏడాదిన్నరకు ఒక సినిమా తీయాలన్నది బేసిక్ రూల్ గా మారింది.

రెమ్యునరేషన్ ను తగ్గించుకొని.. ఏడాదికి కనీసం రెండు మూడు సినిమాలు తీస్తే ఖర్చలు అదుపులోకి రావటంతో పాటు.. నలుగురు బతకటానికి అవకాశం ఉంటుంది. అందుకు భిన్నంగా భారీ బడ్జెట్ తో సినిమాను తీయటం.. దాన్ని ప్రేక్షకుల మీద రుద్దేయటం కూడా సినిమా పరిశ్రమకు ఏ మాత్రం మంచిదికాదన్న విషయం కాస్త ఆలస్యంగా టాలీవుడ్ కు అర్థమైంది.కరోనా కారణంగా రెండేళ్ల పాటు పెద్ద హీరోల సినిమాలన్ని ఒకటి తర్వాత ఒకటిగా విడుదల కావటం.. వాటికి పెట్టిన ఖర్చుతో ప్రేక్షకులు రెండు.. మూడు నెలల పాటు మళ్లీ సినిమాల మాటే ఎత్తింది లేదు. దీంతో.. ఒక్కసారిగా కలెక్షన్లు పడిపోయి.. అసలు థియేటర్ కు వచ్చి సినిమాలు చూస్తారా? అన్న వరకు విషయం వెళ్లింది.

ఇలాంటి వేళలోనే.. సినిమా ఖర్చు తగ్గించటానికి నిర్మాతల టీం ఒకటి ఇటీవల పరిశ్రమలోని రంగాల వారితో భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ భేటీల్లో దిల్ రాజు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు.తాజాగా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టులతో సమావేశం అయ్యారు. వారికిచ్చే రెమ్యునరేషన్ మీద గీరటం మొదలు పెట్టారు.దీనికి బదులుగా అగ్రహీరోల రెమ్యనరేషన్ మీద మాట్లాడేందుకు సాహసం చేయని వారు.. సినిమా ఖర్చులో పల్లీల ఖర్చు మాదిరి ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్టుల పారితోషికాల మీద ఎంత చించితే ఏం లాభం? పల్లీల్ని వదిలేసి.. పల్లీల పొట్టు మీద ఫోకస్ చేస్తే ఎలా ఉంటుందో.. నిర్మాతల తీరు కూడా అలానే ఉందన్న మాట వినిపిస్తోంది.

ముందుగా.. పెద్ద హీరోల పారితోషికాల్ని సగానికి పైనే తగ్గించేసి.. ఏడాదికి కచ్ఛితంగా రెండు సినిమాలు చేసేలా చేస్తే.. చిత్ర పరిశ్రమకు లాభం చేకూరటంతో పాటు బడ్జెట్ ను అదుపు చేసే అవకాశం ఉంటుంది. అంతే తప్పించి.. సహాయ నటులకు.. ఇతర టెక్నిషియన్లకు ఇచ్చే రెమ్యనరేషన్లు ఎంత తగ్గించినా.. బడా హీరోల రెమ్యనరేషన్ తగ్గకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే.. బడా హీరోలతో నిర్మాతలు ఒక మీటింగ్ పెట్టి.. ముందు ఏడాదికి రెండు సినిమాలు తీయాలని చెబితే మొత్తం సీన్ లో చాలానే మార్పులు చోటు చేసుకుంటాయి. అంత ధైర్యం నిర్మాతలకు ఉందా? అన్నదే అసలు ప్రశ్న.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.