Begin typing your search above and press return to search.

జోంబీ రెడ్డి హీరోపై అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారా..?

By:  Tupaki Desk   |   11 Jun 2022 12:30 AM GMT
జోంబీ రెడ్డి హీరోపై అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారా..?
X
బాలనటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించిన తేజ సజ్జా.. ఇప్పుడు హీరోగా మారి వైవిధ్యమైన సినిమాలతో మెప్పిస్తున్నాడు. 'ఓ బేబీ' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన తేజ.. 'జోంబీ రెడ్డి' సినిమాతో డెబ్యూ హీరోగా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'ఇష్క్-నాట్ ఏ లవ్ స్టోరీ' నిరాశ పరిచినప్పటికీ.. 'అద్భుతం' అనే కాన్సెప్ట్ బేస్డ్ చిత్రంతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ''హను-మాన్'' అనే పాన్ ఇండియా మూవీతో వస్తున్నాడు.

తేజా స‌జ్జా హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ప్ర‌శాంత్ వ‌ర్మ తెరకెక్కిస్తున్న సినిమా ''హను మాన్''. కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన జోనర్లలో సినిమాలు చేస్తున్న ప్రశాంత్.. ఇప్పుడు తేజ తో ఫస్ట్ పాన్-ఇండియన్ సూపర్ హీరో మూవీకి శ్రీకారం చుట్టారు. అయితే మేకర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. అది అటూ ఇటూగా రూ.30 కోట్ల వరకూ ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

మామూలుగా హీరో మార్కెట్‌ ని బ‌ట్టి, క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని బ‌డ్జెట్ ఎంతనేది ఆలోచిస్తారు. క‌థ డిమాండ్ మేరకు బడ్జెట్ కాస్త పెరగొచ్చు. కానీ తేజా వంటి అప్ కమింగ్ హీరో పై ఇంత బ‌డ్జెట్ పెట్ట‌డం అంటే రిస్కే అనుకోవాలి. టాలీవుడ్ లో ఇప్పటి వరకు అఖిల్ అక్కినేని - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి ఒకరిద్దరు కుర్ర హీరోలపైనే మేకర్స్ ఎక్కువ బడ్జెట్ పెడుతున్నారు.

ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాల సందడి ఎక్కువైపోయిన తర్వాత బడ్జెట్ లెక్కలు పూర్తిగా మారుపోయాయి. మంచి యూనివర్సల్ అప్పీల్ ఉన్న పాయింట్ దొరికితే.. హీరో మార్కెట్ ని పట్టించుకోవడం లేదు. పాన్ ఇండియా మార్కెట్ గురించే నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సూపర్ హీరో మూవీ 'హను-మాన్' కు ధైర్యంగా అంత బడ్జెట్ పెట్టడానికి రెడీ అయ్యారని అంటున్నారు.

గతంలో ప్రశాంత్ వర్మ - తేజ కాంబోలో వచ్చిన 'జాంబీ రరెడ్డి' సినిమా కమర్షియల్ గా సక్సెస్ గా అవడం కూడా ''హను మాన్'' చిత్రానికి అధిక బడ్జెట్ పెట్టడానికి.. మంచి బిజినెస్ చేసుకోడానికి కారణమైంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ పాన్ ఇండియా సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకి అమ్ముడుపోయినట్లు సమాచారం.

'హను మాన్' సినిమాకు సంబంధించిన డిజిట‌ల్ మరియు శాటిలైట్ హక్కులు మొత్తం క‌లిపి రూ. 22 కోట్ల‌కు విక్రయించారని టాక్ వినిపిస్తోంది. సినిమా బాగుంటే థియేట్రికల్ రన్ తో మంచి వసూళ్ళు సాధించే అవకాశం ఉంది. ఇదే జరిగి పెట్టుబడి వెనక్కి తిరిగి వస్తే.. దర్శక హీరోల మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

'హను-మాన్' సినిమాలో తేజ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. విలక్షణ నటుడు వినయ్ రాయ్ విలన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషలలో ఈ పాన్ ఇండియా సూపర్ హీరో మూవీ విడుదల కానుంది.